పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తోటపల్లి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ జియ్యమ్మవల స గ్రామానికి చెందిన ప్రశాంతి సోమవారం పీజీ ఆర్ఎస్ కార్యక్రమంలో డీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక ప్రైవేట్ ట్రస్టు పెత్తనం సాగిస్తోందని ఆమె ఫిర్యాదు చేశారు. ఆలయానికి వచ్చే విరా ళాలు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సింది పోయి, ప్రైవే ట్ వ్యక్తుల ఖాతాల్లో జమ అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదాల తయారీలో టెండర్ల ప్రక్రియను పక్కనపెట్టి, పారదర్శకత లేకుండా తమకు నచ్చిన వారికి పనులు కట్టబెడుతున్నారన్నారు. ఆలయ అధికారుల సమక్షంలోనే నిధుల మళ్లింపు జరుగుతున్నా స్పందించకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. దేవస్థానంలో ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పూజలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఆలయాన్ని పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.


