● కలెక్టరేట్ వద్ద సీపీఎం నిరసన
పార్వతీపురం రూరల్: ఒడిశా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన కొటియా సరిహద్దు గ్రామ గిరిజనులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ.. సరిహద్దు గ్రామాల్లో గిరిజనులను ఒడిశా పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అరెస్టయిన తాడంగి పిలుపు, చిరంజీవిలను వెంటనే విడిపించేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. కొటియా సరిహద్దు సమస్యకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని, గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పరిష్కారం లభించని పక్షంలో ప్రజా సంఘాలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ మేరకు జాయింట్ కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కొటియా గ్రామస్తులు తాడంగి సన్నం, కేసు, సీపీఎం నేతలు మర్రి శ్రీనివాసరావు, బి.వెంకటరమణ, గేదెల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు బత్తిన మోహనన్ రావు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాలక రంజిత్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


