న్యూస్రీల్
–8లో
బండ
● భారత్ గ్యాస్ అందక వినియోగదారుల అవస్థలు
● ఖాళీ సిలిండర్లతో గంటలకొద్దీ ఎండలో నిరీక్షణ
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గత సంక్రాంతి నుంచి మాకు సిలిండర్లు రా వడం లేదు. వంట కోసం కట్టెలు ఏరుకుంటున్నాం. ఎన్నిసార్లు ఇక్కడ ఆఫీసుకు వచ్చినా బండ ఇవ్వడం లేదు. బయట తెచ్చుకున్నా.. రూ. 1,100 వరకూ తీసుకుంటున్నారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిస్థితి బాలేదు. అధికారులు
దృష్టి సారించాలి.
– సుజాత, బంటువానివలస
మాకు కొద్ది రోజుల కిందటే సిలిండర్ బుక్ అయినట్లు చూపింది. ఇప్పటివరకూ బండ ఇవ్వడం లేదు. సాలూరు ఏజెన్సీ వారు చూసుకుంటారు అని నంబర్ ఇచ్చారు. ఎన్నిసార్లు చేసినా అవ్వడం లేదు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఇక్కడే ఉన్నా.. ఈ రోజు అయినా బండ ఇంటికి తీసుకు వెళ్తామో, లేదో..! అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. – చంటి, శివిని
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ సరఫరా కేంద్రం కొన్నాళ్లుగా తెరుచుకోవడం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లో వంట గ్యాస్కు కష్టాలు తప్పడం లేదు. దీనికి తోడు.. ఈ కేంద్రం చుట్టూ అల్లుకున్న రాజకీయ వివాదాలు వినియోగదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. కొన్ని నెలలుగా ఏజెన్సీ యాజమాన్యం విషయంలో వివాదాలు ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి కేంద్రం మూతపడే ఉంది. గతంలో పలుమార్లు ఇక్కడ వినియోగదారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం సాలూరు ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు అప్పగించినా పరిస్థితిలో మార్పులేదు. వినియోగదారుల కష్టాలు తీరలేదు.
ఇదే ఆధారం..
కొమరాడ మండలంలోని కందివలస, కుమ్మరిగుంట, కంభవలస, రాజ్యలక్ష్మిపురం, రావికర్ర వలస, సుందరాపురం, అంకుళ్లవలస, కోనవలస, డంగభద్ర, బొడ్డవలస, లక్ష్మీపేట, పార్వతీపురం, మండల పరిధిలోని పలు గ్రామాలు, బలిజిపేట, సీతానగరం తదితర ప్రాంతాల భారత్ గ్యాస్ వినియోగదారులు ఈ ఏజెన్సీపైనే ఆధారపడి ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు చవిచూస్తున్నారు. సాంకేతిక కారణాలతో గ్యాస్ ఏజెన్సీ కోడ్ను మార్చకపోవడం వల్ల వినియోగదారులు గ్యాస్ కోసం ప్రయత్నించినా బుకింగ్ అవ్వడం లేదు. ఓటీపీలు రావట్లేదు. కొంతమందికి బుక్ అయినట్లు సంక్షిప్త సందేశాలు వస్తున్నా.. సిలిండర్లు మాత్రం ఇవ్వడం లేదు. అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో వినియోగదారుల కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. దాదాపు గత సంక్రాంతి నుంచి తమకు సిలిండర్లు రావడం లేదని వినియోగదారులు గగ్గోలుపడెతున్నారు. ఇటీవల ఆందోళన నేపథ్యంలో 125 గ్యాస్ సిలిండర్లను తెప్పించి వేచి ఉన్న వారికి పంపిణీ చేశారు. శనివారం కూడా గ్యాస్ సిలిండర్ లారీ లోడు రావడంతో సమాచారం అందుకున్న వందలాదిమంది బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పడిగాపులు కాశారు. తమ వంతు కోసం ఖాళీ సిలిండర్లను వరుసలో పెట్టారు. రోజంతా పడిగాపులు కాసినా.. వీరికి సమాధానం ఇచ్చేవారు కూడా లేకపోవడం గమనార్హం. ఫోన్లు చేస్తే సంబంధిత భారత్ గ్యాస్ ప్రతినిధులు స్పందించడం లేదని వారంతా వాపోతున్నారు. ఫోన్ చేస్తే.. సాలూరులో సంప్రదించాలని ఒకసారి, రామభద్రపురం అని మరోసారి చెబుతూ తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


