విజయనగరం: విజయనగరం ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ పి.సీతారామాంజనేయులు ఏషియన్ బాక్సింగ్ పోటీలకు ఇండియా జట్టు కు కోచ్గా ఎంపికయ్యారు. ఏషియన్ అండర్ – 15 బాల, బాలికల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు పంజాబ్లో శిక్షణ ఇస్తున్నారు. విజయనగరం నుంచి తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో వచ్చే నెల 1 నుంచి 16వ తేదీ వరకు జరిగే అండర్–15 విభాగంలో ఉజ్బెకిస్తాన్లో బాక్సింగ్ పోటీలకు కోచ్గా వ్యవహరించనున్నారు. ఈయన ఎంపిక పట్ల క్రీడాకారులు, కోచ్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
బొండపల్లి: మండల కేంద్రమైన బొండపల్లిలోని పెట్రోలు బంకు సమీపంలో జాతీయ రహదారి 26పై బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన కోరాడ మనోజ్ తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని పెట్రోలు బంకుకు వస్తుండగా విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడిని 108 వాహనంలో గజనతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ప్రధమ చిక్సిత అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని మహరాజా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వ్యక్తి అరెస్టు
కొత్తవలస : వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంల వద్ద అమాయకులను గుర్తించి వారిని బురిడీ కొట్టి మోసాలకు పాల్పడుతున్న తెర్లాం మండలం సతివాడకు చెందిన ఎ.శ్యాంసుందరరావుని సీఐ ఎస్.షణ్ముఖరావు శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి సీఐ తెలిపిన వివరాలు... నిందితుడు శ్యాంసుందరరావు ఏటీఎంల వద్ద అనుమానంగా తిరుగుతూ ఏటీఎంలు వినియోగించే అమాయకులకు సహకరిస్తున్నట్టు నటించి వారి ఏటిఎంను మార్చి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన కొత్తవలస ఎస్బీఐ ఏటీఎం వద్ద ఎస్.శ్రీనును మోసం చేసి రూ.13వేలు కాజేసినట్టు సీఐ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు శ్యాంసుందరరావును అరెస్టు చేసి కొత్తవలస కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులిచ్చి మోసపోవద్దని సూచించారు. ఆయన వెంట ఎస్ఐలు జోగారావు, ప్రసాద్ ఉన్నారు.


