● మరో ఐదు రోజులు తీవ్ర ఎండల ముప్పు ● 41 డిగ్రీలు నుంచి 54 డిగ్రీలు హీట్ ఇండెక్స్ నమోదయ్యే అవకాశం ● జిల్లా ప్రజలకు ముందస్తు సూచన
పార్వతీపురం: జిల్లాలో రాబోయే ఐదు రోజులపాటు తీవ్ర ఎండలు, వడగాడ్పులు ఉండనున్నాయని రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీ) విభాగం హెచ్చరికలు జారీ చేసింది. తాజా వాతావరణ అంచనాల ప్రకారం, జిల్లాలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలోని 15 మండలాల్లో హీట్ ఇండెక్స్ 41 డిగ్రీల నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ స్థాయిని వాతావరణశాఖ ‘ప్రమాదకర స్థాయి’గా గుర్తించింది.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మండలాలు:
జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, పాలకొండ తదితర మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
వాతావరణ పరిస్థితులు
రాబోయే ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశంలేదు. వాతావరణం పొడిగా, వేడిగా ఉండే అవకాశం ఉంది.
ప్రజలకు సూచనలు
ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. రోజంతా తగినంత నీరు తాగాలి. వృద్ధులు, పిల్లపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తేలికపాటి దుస్తులు ధరించి, సూర్యరశ్మి నుంచి రక్షణ తీసుకోవాలి.
అధికారుల హెచ్చరిక
ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే హీట్వేవ్ ప్రభావం నుంచి రక్షణ పొందగలరని అధికారులు స్పష్టం చేశారు.


