● మార్కెట్లో తగ్గిన ధర ● గత ఏడాదితో పోల్చితే పడిపోయిన ధర ● కేజీ జీడి మార్కెట్లో రూ.145
కురుపాం: ప్రతి ఏడాది జీడికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండేది. ఒకానొక సమయంలో కేజీ జీడి రూ. 200 వరకు ధర పలకగా..ఈ ఏడాది మాత్రం కేజీ ధర 145కి పడిపోయింది. దీంతో జీడిరైతు లబోది బోమంటున్నాడు. అయితే ధర పడిపోవడానికి ముఖ్య కారణం పూర్తిస్థాయిలో జీడిలో నాణ్యత లేక పోవడమేనని వ్యాపారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో జీడి పిక్కలు ఎండినవి వస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుందని పచ్చిగా ఉండడడంతో ప్రస్తు తం మార్కెట్లో ధర తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
దిగుబడి తక్కువ ఉన్నా పెరగని మార్కెట్ ధర
వాస్తవానికి దిగుబడి తక్కువగా ఉంటే మార్కెట్లో ధర పెరగాలి. కానీ దిగుబడి తక్కువగా ఉన్నా ధర లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కిందట మార్కెట్లో కేజీ జీడి పిక్కల ధర రూ.165 ఉండగా ప్రస్తుతం రూ.145కు పడిపోయింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న గిరిజన రైతులు డీలా పడిపోయారు. మరోదారి లేక కొంతమంది రైతులు వ్యాపారులకు విక్రయించేస్తుండగా మరి కొంతమంది భవిష్యత్లో ధర పెరిగే అవకాశం ఉందని తమ వద్దనే నిల్వ ఉంచుకుంటున్నారు.
జీడిపై వేలాదిమంది రైతుల ఆధారం..
కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, కొమరా డ, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఎక్కువ శాతం మంది గిరిజనులు జీడి సాగు పైనే ఆధారపడుతుంటారు. మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుందని ఆశతో నిరీక్షిస్తుంటారు అటువంటి ది ఈ ఏడాది ధర తగ్గిపోవడంతో దిగాలుగా ఉన్నారు.


