● ఖాళీ సిలిండర్లతో వినియోగదారుల నిరసన
పార్వతీపురం రూరల్: భారత్ గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను నిరసిస్తూ బుధవారం పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల ఏజెన్సీ కార్యాలయం వద్ద వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో ఆందోళన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో బాధితులు ఏజెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు బి.వి.రమణ, బి.సూరిబాబు మాట్లాడుతూ.. ఏజెన్సీ నిర్వహణలో వచ్చిన మార్పులు, సాంకేతిక కారణాల వల్ల గ్యాస్ బుకింగ్లు కావడం లేదని, ఓటీపీలు రాక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, తక్షణమే సాంకేతిక సమస్యలను పరిష్కరించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఆందోళనపై స్పందించిన జిల్లా పౌరసరఫరాల అధికారులు తక్షణమే 125 గ్యాస్ సిలిండర్లను తెప్పించి వేచి ఉన్న వినియోగదారులకు పంపిణీ చేశారు. ఈ నిరసనలో లబ్ధిదారులు రాజు, వెంకట నాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


