పార్వతీపురం రూరల్: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్వతీపురం మన్యం కలెక్టరేట్ ఎదుట పీఆర్టీయూ మంగళవారం ఆందోళన చేసింది. సమస్యలు పరిష్కరించాలంటూ నినదించింది. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరాపు సూర్యనారాయణ, సంఘ రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు కర్రి రోజా రమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాగాన విజయ, రాష్ట్ర కార్యదర్శి జక్కు రామినాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గంట శశికుమార్, శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ తక్షణమే ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, పీఆర్సీ కమిటీని ఏర్పాటుచేయాలని, సీపీఎస్ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎర్నల్లీవ్ ఎన్క్యాష్మెంట్ అంశాలను అమలు చేయాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని కోరారు. జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో నిర్వహించాలని, జీఓ 302ను పునరుద్ధరించి జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పించాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, టెట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


