● తోటపల్లి విగ్రహ ఘటనపై చినజీయర్ స్వామి ఆశ్చర్యం
సాక్షి, పార్వతీపురం మన్యం: గరుగుబిల్లి మండలం తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో 52 సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న స్వామివారి విగ్రహాన్ని వెలుపల పడేయడంపై బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు త్రిదండి చినజియర్ స్వామి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాకు మంగళవారం వచ్చిన చినజియర్ స్వామిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారావురెడ్డి శ్రీనివాసరావు, నాయకులు సురేష్, బాలు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతా భాస్కరనాయుడు, రామకృష్ణ, మూడు జిల్లాల కార్యదర్శి సత్యనారాయణ తదితరులు కలిశారు. స్వామికి జరిగిన అపచారాన్ని, తోటపల్లి ఆలయంలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. చరిత్ర ఉన్న విగ్రహాన్ని పూజలు లేకుండా పడేయడంపై చినజియర్ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై వినతిపత్రాన్ని ఈవోకు కూడా ఇవ్వాలని ఆయన చెప్పారు. ఆలయ కమిటీ నిర్వాకం వల్లే ఈ విగ్రహం బయటపెట్టాల్సి వచ్చిందని దేవదాయశాఖ చెబుతోందని బీజేపీ నాయకులు వివరించారు. అనంతరం చినజియర్స్వామి సూచన మేరకు తోటపల్లి ఆలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.


