వినతుల పరిష్కారంలో
విజయనగరం గంటస్తంభం: ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించే విషయంలో ఎటువంటి జాప్యం తగదని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూక్లినిక్ కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను వినతుల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, వినతుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం సహించబోమని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న అన్ని వినతులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, జిల్లా స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఈ.మురళి, కళావతి, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
రెవెన్యూ వినతులే అధికం..
మొత్తం అందిన 202 వినతుల్లో 93 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. రెవెన్యూ సమస్యలు, ముఖ్యంగా భూ సంబంధిత, సర్వే సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..
పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో తెలియజేసే సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. ప్రతి వినతిని ఆన్లైన్లో పర్యవేక్షిస్తూ వేగవంతమైన పరిష్కారం చూపించాలని తెలిపారు.
శాఖల వారీగా వినతులు..
రెవెన్యూశాఖకు 93 వినతులు రాగా.. డీఆర్డీఏ–17, పంచాయతీరాజ్–19, మున్సిపల్–23, విద్యుత్–3, హౌసింగ్–3, డీసీహెచ్ఎస్–2, వైద్య ఆరోగ్యశాఖ–5, గ్రామ సచివాలయం–4, విద్యాశాఖ–3, ఇతర శాఖలకు 30 వినతులు అందాయి.
పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్కు భారీ స్పందన
202 వినతులను స్వీకరించిన అధికారులు
ఇందులో 93 రెవెన్యూ సమస్యలే
పెండింగ్ వినతులపై
కలెక్టర్ సీరియస్


