చీపురుపల్లి: పై చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి చీపురుపల్లి పట్టణంలోని అన్నపూర్ణకాలనీకు చెందిన దువ్వూరి సాయికృష్ణ. ఈయన 2023 ఏడాది చివరిలో అనారోగ్యం బారిన పడడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా బైలేటరల్ లోవర్ లింబ్, ఇంపైర్డ్ రీచ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో విశాఖపట్టణం, హైదరాబాద్లో చికిత్స తీసుకున్నాడు. ఇందుకోసం అతను సంపాదించిన సొమ్మంతా ఖర్చు కాగా ఇంకా అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఇతనికి ఛాతి నుంచి కింద భాగం అచేతనంగా మారిపోయింది. దీంతో అన్నీ మంచంపైనే జరుగుతుండడంతో ఆయన భార్య సేవలు అందిస్తోంది. వీరికి పిల్లలు కూడా లేరు. అయితే ప్రస్తుతం వీరు డైపర్లు, యూరిన్ బ్యాగులు కొనుక్కునే పరిస్థితుల్లో కూడా లేరు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం పీజీఆర్ఎస్లో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. కనీసం పింఛన్ మంజూరైనా గంజినీళ్లు తాగి బతుకుతామని భార్యాభర్తలు అంటున్నారు.
ఇలాంటి వారెందరో..
ఇది సాయికృష్ణ లాంటి ఎంతో మంది ఆదరణ లేని వారి ఆవేదన. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్క కొత్త ఫించన్ కూడా ఇవ్వకపోవడంతో ఇలాంటి ఎంతో మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పాత పింఛన్ల పంపిణీ కోసం ప్రతినెలా ఒకటో తేదీన ఎమ్మెల్యేల నుంచి సీఎం వరకు కోట్లాది రూపాయలతో ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఇలాంటి ఎంతోమంది అర్హులకు న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
90 శాతం వికలాంగత్వం ఉన్నా
పింఛన్ మంజూరు చేయని అధికారులు, ప్రజాప్రతినిధులు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న
సాయికృష్ణ
కనీసం డైపర్లు, యూరిన్ బ్యాగ్లు
కొనుగోలు చేయలేని పరిస్థితి
దుర్భర జీవితం అనుభవిస్తున్న భార్యాభర్తలు


