సీతంపేట: సీతంపేటలో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం ఉగాది పర్వదినాన దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్తో కాసేపు ముచ్చటించారు.
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, ముస్లింలకు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దానగుణం, భక్తికి రంజాన్ పండగ ప్రతీక అని పేర్కొన్నారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి, క్రమశిక్షణతో కూడిన జీవనం సాగించడం అభినందనీయమన్నారు. జిల్లాలోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా, సోదరభావంతో పండగను జరుపుకోవాలని, జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
పక్కుడుభద్ర వైపు ఏనుగులు
భామిని: తివ్వకొండలకు సమీపంలోని పక్కుడుభద్ర పరిసరాల్లోకి ఏనుగులు గురువారం చేరుకున్నాయి. నేరడి బ్యారేజ్ సమీపంలో సంచరిస్తూ తివ్వకొండల వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. పచ్చని పంట పొలాల్లో సంచరిస్తూ నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఏనుగుల మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మన్యంలో భారీ వర్షం
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది. సుమారు గంట సమయం పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్పేట, జె.కె.పాడు, ఎస్.కె.పాడు, తాడికొండ, తోలుఖర్జ, ఇరిడి తదితర గ్రామాల పరిధిలో గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం చల్ల బడడంతో ప్రజలంతా ఉపశమనం పొందారు.


