రామభద్రపురం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రతిభా పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గతేడాది డిసెంబర్ 7న నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 4009 మంది హాజరుకాగా.. ఇందులో రామభద్రపురం మండలానికి చెందిన వారు 55 మంది ఉన్నారు. అయితే పరీక్షలు నిర్వహించి మూడు నెలలు దాటినా ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తదితర జిల్లాల్లో ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షల ఫలితాలు విడుదల చేశారన్న సమాచారం ఉందని.. మన జిల్లాలో ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఫలితాలు త్వరితగతిన విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేలు చొప్పున్న నాలుగేళ్లు ఉపకార వేతనం అందించనున్నారు.
ఆకట్టుకున్న ఎడ్లబళ్ల
పందాలు
వేపాడ: మండలంలోని వావిలపాడులో నూకాలమ్మ పండగ సందర్భంగా గురువారం నిర్వహించిన ఎడ్లబళ్ల పందాలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో 15 ఎడ్ల బళ్లు పాల్గొనగా.. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అంతకుముందు నూకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


