● బ్లాక్మార్కెట్లో విక్రయం
● తప్పనిసరి పరిస్థితిలో హోటల్ వ్యాపారుల కొనుగోలు
కురుపాం:
ఇరాన్– ఇజ్రాయిల్ మధ్య సాగుతున్న యుద్ధంతో వంటగ్యాస్ కొరత అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురుపిస్తోంది. ఇదే అదునుగా తీసుకున్న గ్యాస్ అక్రమ నిల్వదారులు తమవద్ద ఉన్న సిలిండర్లను స్థానిక హోటల్స్కు, టిఫిన్ సెంటర్లకు గుప్ చుప్గా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో సిలిండర్ను రూ.2000కు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.980కు గ్యాస్ ఏజన్సీ నుంచి వినియోగదారునికి సరఫరా అయ్యేది . ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా వ్యాపారులు అవసరాన్ని బట్టి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
మూత పడుతున్న
చిరువ్యాపార సముదాయాలు
గ్యాస్ కొరత కారణంగా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరను పెట్టి కొనుగోలు చేయలేని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ పాయింట్స్, టిఫిన్ సెంటర్లు మూతపడగా మరికొంత మంది మాత్రం అధిక ధరకు గ్యాస్ దిమ్మలను కొనుగోలు చేసి తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. టిఫిన్ ధరలను కూడా పెంచేశారు. సివిల్ సప్లై అధికారులు దృష్టి సారించి అక్రమ అమ్మకాలకు అడ్డుకట్టవేయాలని, సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని వ్యాపారులతో పాటు స్థానికులు కోరుతున్నారు.


