● ఇద్దరు చిన్నారులు మృతి ● తల్లిదండ్రులకు కడుపుకోత ● గ్రామంలో అలముకున్న విషాదం
గుమ్మలక్ష్మీపురం: పాఠశాలలకు ఒంటిపూట బడులు ఆరంభమయ్యాయి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చి శుభకార్యంలో సంతోషంగా గడిపారు. పిల్లలతో కలిసి ఆడుకున్నారు. అనంతరం స్నేహితుడితో కలిసి సరదాగా స్నానం కోసం చెరువుకు వెళ్లారు. అంతే.. ఈత సరదా ఇద్దరు చిన్నారులను ముంచేసింది. కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చింది. గ్రామస్తుల్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే...
గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గౌడు శిభో(9), గౌడు హర్ష(9) నాలుగో తరగతి చదువుతున్నారు. సోమవారం నుంచి పాఠశాలకు ఒంటిపూట బడు లు ప్రారంభమయ్యాయి. పాఠశాల విడిచిపెట్ట డంతో ఇళ్లకు వెళ్లిన చిన్నారులు కుటుంబీకులతో కలిసి గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. భోజనాలు చేసిన అనంతరం ఇంటికొచ్చారు. మరో స్నేహితుడితో కలిసి చెరువులో స్నానం చేసేందుకు, ఈత కొట్టేందుకు సరదాగా వెళ్లారు. వరుసకు బావమరుదులైన వీరిరువురు ముందుగా చెరువులో దిగి ఈతకొట్టేందుకు లోపలికి వెళ్లగా మునిగిపోయారు. దీనిని గమనించిన మరో చిన్నారి గ్రామంలోకి వచ్చి విషయం చెప్పడంతో పరుగున వెళ్లారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు నీటిపై తేలియాడుతూ కనిపించారు. శిభో మృతదేహాన్ని తల్లిదండ్రులు గౌడు సులోచన, రమో, బంధువులు ఇంటి కి తీసుకెళ్లగా.. కొన ఊపిరి ఉందన్న అనుమానంతో హర్షను తల్లిదండ్రులు గౌడు షర్మిల, లిట్టి, బంధువులు భద్రగిరి సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు హర్ష మృతి చెందినట్లు నిర్థారించారు. ఇరువురు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుపెట్టారు. ఎల్విన్పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
చదువులో హర్ష టాపర్
ఎంతో చలాకీగా ఉన్న హర్ష గ్రామంలోని ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ టాపర్గానే ఉండేవాడని ఉపాధ్యాయుడు శ్యాంసుందర్తో పాటు తల్లిదండ్రులు చెబుతున్నారు.
శిభో మీదే తల్లిదండ్రుల ఆశలు
నలుగురు పిల్లలు చనిపోయక రాఘవ, శిభోలు పుట్టినప్పటికీ, రాఘవ కంటే శిభో ఎంతో ఉత్సహంగా ఉండేవాడని, ఆశలన్నీ వాడిమీదే పెట్టుకు న్నామంటూ గౌడు సులోచన, రమో కన్నీరుపెడుతున్నారు.


