● జిల్లాలో 68 కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న 10,646 మంది విద్యార్థులు
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) బ్రహ్మాజీరావు శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 222 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన మొత్తం 10,646 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం జిల్లాలో 68 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఆయన వివరించారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 68 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 612 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. నిరంతర తనిఖీల కోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఐదు సిట్టింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్న్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వసతులతో పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులు హాల్టికెట్ చూపిస్తే ఏపీఎస్సార్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు.


