విజయనగరం: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా మార్చి 6 నుంచి జరుగుతున్న 7వ పారా బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు బ్రాంజ్ మెడల్ సాధించి సత్తా చాటాడని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ మంగళవారం తెలిపారు. ఎస్.యూ. 5 కేటగిరి మెన్స్ డబుల్స్లో కర్ణాటకకు చెందిన జంషద్తో కలిసి ఆడిన సత్తిబాబు అత్యుత్తమ ప్రతిభ కనబరచి బ్రాంజ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు. ఈ విజయం వెనుక సత్తిబాబు కృషి, పట్టుదల, ధృడ సంకల్పం, నిరంతర సాధన ఉన్నాయని, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని అకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగించిన సత్తిబాబును పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి వి.రామస్వామి తదితరులు అభినందించారు.


