హోటళ్లపై పౌర సరఫరాల అధికారుల దాడులు
● 19 గృహ వినియోగ సిలిండర్లు స్వాధీనం
● 6ఏ కేసులు నమోదు : డీఎస్ఓ మురళీనాధ్
విజయనగరం కలెక్టరేట్: జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాధ్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలో పలు హోటళ్లు, డాబాలు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లపై ఆ శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేసి, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 19 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు చోట్ల సివిల్ సప్లయిస్ డీటీలు తనిఖీలు నిర్వహించి, 6ఏ కేసులను నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఓ మురళీనాధ్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాణిజ్య అవసరాలకు వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు.


