సాంకేతికతతో సాధించారు..
● పలు కేసులను ఛేదించిన పోలీసులు
● వివరాలు వెల్లడించిన డీఎస్సీ రాంబాబు
పాలకొండ: పాలకొండ పోలీసు సర్కిల్ పరిధిలోని పలు కేసులను పోలీసులు సాంకేతికతను ఉపయోగించి ఛేదించారు. గత కొంత కాలంగా మాయమౌతున్న ద్విచక్ర వాహనాల రహస్యాన్ని బయటపెట్టారు. ఈ మేరకు ఆ వివరాలను డీఎస్పీ ఎం.రాంబాబు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన తోట ప్రసాద్ గత కొంత కాలంగా పాలకొండలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మద్యానికి బానిసగా మారిన ప్రసాద్ ద్విచక్ర వాహనాలు దొంగతనం చేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించి వాటి పార్టుల విభజించి అమ్మకోవడం చేస్తున్నాడు. దీనిపై పోలీసుస్టేషన్లో పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసు పరిశీలనలో భాగంగా స్థానిక ఎస్సై ప్రయోగమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశారు. వీరు వాహనాలు పోయిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల సహాయంతో అనుమానితున్ని గుర్తించారు. గురువారం ఉదయం నిందితుడు ద్విచక్ర వాహనంపై పాలకొండ వైపు వస్తుండగా ఎలాం సెంటర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విచారించగా నాలుగు ద్విచక్ర వాహనాలు మండలంలోని వెలగవాడ సమీపంలో దాచి ఉంచినట్టు తెలుసుకుని వాటిని పోలీసుస్టేషన్కు తరలించారు. జలుమూరు మండల పరిధిలో మరో ద్విచక్ర వాహనాన్ని దొంగలించి ఇక్కడే దాచినట్టు గుర్తించారు. ఈ వాహనాలను పార్టులుగా విడదీసి అమ్మేందుకు సిద్ధం చేస్తున్నాడని వివరించారు. నిందితున్ని విచారించి మరింత సమాచారం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
బంగారం చోరీ కేసు పరిష్కారం
ఈ నెల 15న పాలకొండ పట్టణంలోని వాండ్రంకి వీధిలో మూడున్నర తులాల బంగారం చోరి కేసును ఛేదించామని డీఎస్పీ తెలిపారు. సాహిని హైమావతి తన ఇంటిలో ఉంచిన బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్టు ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పలువురు అనుమానితులను గుర్తించి విచారించారు. ఈ విచారణంలో బాధితురాలి మనవడి సాహిని సాయికృష్ణ ఈ దొంగతం చేసినట్టు గుర్తించి అరెస్టు చేసి అతని నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందికి రివార్డులను డీఎస్పీ అందించారు. సీఐ ప్రసాద్, ఎస్సై ప్రయోగమూర్తి, ట్రైనీ ఎస్సై హేమలత ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. అవకాశం ఉన్నవారు తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ద్విచక్ర వాహనాలకు హేండిల్ లాక్ వేయాలని తెలిపారు.
సాంకేతికతతో సాధించారు..


