
డీలా..!
ఆదుకోకుంటే మరణమే శరణ్యం
స్పందించకుంటే పోరాటమే..
రోజంతా కష్టపడితే..
ఆటోవాలా..
● మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో స్టాండ్ దాటని ఆటోలు
● జిల్లాలో 12వేల పైచిలుకు ఆటోవాలాలపై ప్రభావం
పాలకొండ రూరల్:
మహిళలకు సీ్త్రశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పించిన కూటమి సర్కారు ఆ పథకం అమలుతో బతుకు భరోసా కోల్పోతున్న ఆటోవాలాల జీవనంపై దృష్టి సారించడం లేదు. దీంతో ఆటోలు స్టాండ్ దాటక ఆటోవాలాల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఎన్నికల సమయంలో తమకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఇప్పటికే రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు తాజాగా ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కోల్పోతున్న జీవన ప్రమాణాలు మెరుగుపరచాలంటూ రోడ్డెక్కుతున్నారు. అయినా కూటమి పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో ఆటో వాలాలు కూటమి పాలనపై నిప్పులు చిమ్ముతున్నారు. ఎన్నికల వేళ అధికారం కోసం తమకు అనేక హామీలు ఇచ్చిందని, నేడు వాటిని నెరవేర్చమంటే ముఖం చాటేస్తుందని పేర్కొంటున్నారు.
జిల్లాలో 12 వేలకు పైగా ఆటోలు నిత్యం తిరిగాడేవని ఒక అనాధికారిక లెక్క. ఈ ఆటోవాలాల కుటుంబ సభ్యులు దాదాపు 36వేల పైచిలుకు ఉన్నారని యూనియన్ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఆటో, ట్యాక్సీ లైసెన్సులు కలిగిన డ్రైవర్లకు సూపర్ సిక్స్తో పాటు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తరువాత తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ బతుకు బండికి సీ్త్రశక్తి పథకంతో చెక్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ఖర్చులు
ఆటో నిర్వహణకు సాధారణంగా ఖర్చులుంటాయి. ప్రస్తుతం పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో ఆటో కార్మికులకు రోజంతా కష్టపడితే కనీసం రూ.300 నుంచి రూ.400 వరకు కూడా మిగలని పరిస్థితి. ప్రతి సంవత్సరం ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం దాదాపు రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు తనిఖీల పేరుతో పోలీసులు రవాణా శాఖ అధికారులు దాడులు చేసి వేల రూపాయలు జరిమానాలు విధిస్తున్నారు. ఆటో కొనుగోలు కోసం తీసుకున్న రుణాలకు నెలవారి వాయిదాలు కట్టుకోలేక తమ బతుకులు, దినదిన గండంగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగనన్న ప్రభుత్వ హయాంలో..
గత జగనన్న ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్ కేటాయించేది. అర్హులైన ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి వాహన మిత్ర పేరిట రూ.10 వేలు వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో పాటు వాహన డ్రైవర్ ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల బీమా అందించేవారు. అలాగే రవాణా వాహనం కొనుగోలుకు బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే డ్రైవర్లకు రూ.3 లక్షల వరకు వడ్డీ రాయితీ అందించి భరోసా కల్పించేవారని ఆటోడ్రైవర్లు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా కూటమి సర్కారు ఆటోవాలాల అభ్యున్నతికి కృషి చేయాలంటూ ఆయా సంఘాల నాయకులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆదుకోకుంటే మరణమే శరణ్యం అన్నట్లుంది మా పరిస్థితి. శాంతియుతంగా మా సమస్యలను అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. అయినా ఫలితం లేదు.
– ఐ.ప్రసాద్, ఆటోడ్రైవర్, పాలకొండ
ప్రభుత్వం స్పందించకుంటే పోరాటమే శరణ్యం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆటోవాలాలు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. అయినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో ఆర్థిక సాయంతో పాటు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అవేమీ కార్యరూపం దాల్చలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి.
– దావాల రమణారావు, సీఐటీయూ జిల్లా నాయకుడు
రోజంతా కష్టించి ఆటో నడిపితేనే కుటుంబాన్ని పోషించగలం. ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా గిరాకీ లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంపాదన లేకపోవడంతో ఆటోలను నమ్ముకున్న మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికల హామీలను అమలు చేయాలి. – కాద రాము,
ఆటో యూనియన్ నాయకులు, పాలకొండ

డీలా..!

డీలా..!

డీలా..!

డీలా..!