
అయ్యవార్లకు అందని జీతాలు
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో 151 యుపీ పాఠశాలలను ఎత్తివేశారు.1053 ప్రాథమిక పాఠశాలలను 827కు కుదించారు. వాటి స్థానంలో కొత్తగా 91 ఫౌండేషన్ స్కూల్స్, 602 బేసిక్ స్కూల్స్, 221 మోడల్ ప్రైమరీ స్కూల్స్, 35 యూపీ స్కూల్స్, 80 హైస్కూల్స్,10 బేసిక్ ప్రైమరీ హైస్కూల్స్, 9 మోడల్ హైస్కూల్స్ ను తీసుకువచ్చారు. వాటితో పాటు కేజీబీవీలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలతో కలిపి జిల్లా వ్యాప్తంగా 1,504 సర్కారు బడులు ఉన్నాయి. వాటిలో 5,640 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో బదిలీలపై ఒక పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వచ్చిన 1,150 మంది ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరంలో నేటి వరకు జీతాలు అందకపోవడంతో కూటమి ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు.
● వచ్చే నెల కూడా అందవంటున్న
ఉపాధ్యాయులు
● జిల్లాలో మొత్తం పాఠశాలలు: 1,504
● పనిచేస్తున్న ఉపాధ్యాయులు: 5,640 మంది
● జీతాలు అందని ఉపాధ్యాయులు: 1,150 మంది
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తామని చెప్పిన కూటమి నేతలు చెప్పిన మాటలన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలిపోయింది. 1వ తేదీ కాదుకదా రెండు నెలలవుతున్నా కొందరు ఉపాధ్యాయులకు జీతాలు అందకపోవడంపై కూటమి ప్రభుత్వం తీరుపై అయ్యవార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యావ్యవస్థలో నూతన మార్పులు తెస్తామని పేదవారికి సర్కారు విద్యను దూరం చేసిన కూటమి ప్రభుత్వం అందులో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులకు జీతాలు కూడా ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి.
అంతా హంగామా..
రీ–స్ట్రక్చర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పలు ప్రాథమిక, యూపీ పాఠశాలలకు మంగళం పలికారు. వాటి స్థానంలో ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ హైస్కూల్స్, మోడల్ హైస్కూల్స్ ను తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. వాటిలో మోడల్ ప్రైమరీ స్కూల్స్లో కొత్తగా హెచ్ఎం పోస్టులను సృష్టించి స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా నియమించింది. ఇలా బదిలీ అయినవారితో పాటు ఇటీవల జరిగిన సాధారణ బదిల్లో వచ్చిన వారెవరికీ జూన్ నెల జీతాలు వేయలేదు.జూలై నెల జీతాల బిల్లులు కూడా పెట్టలేదు.దీంతో జూలైలో రెండు నెలల జీతాలు అందుతాయనుకున్న బదిలీ ఉపాధ్యాయలకు నిరాశే మిగిలింది. కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు పొజిషన్ ఐడీ లు ఇచ్చి బదిలీ ఉపాధ్యాయులకు జీతాలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
ఆర్థిక అనుమతులు లేకపోవడమే కారణమా?
రీ–స్ట్రక్చర్ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు ఆర్థిక అనుమతులు లేకపోవడంతోనే బదిలీ ఉపాధ్యాయులకు జీతాలు అందలేదని పలువురు అంటున్నారు. వాస్తవానికి కొత్తగా వచ్చిన విద్యా విధానంపై ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించి ఆమోదం తెలపాలి. తర్వాత వాటికి ఆర్థిక అనుమతులు ఇవ్వాలి. అయితే ఇవేవీ పాటించకుండా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యావిధానంలో కొందరు అయ్యవార్లకు జీతాలు అందక సతమతమవుతున్నారు.జూలై నెలకు సంబంధించిన జీతాల బిల్లులను ట్రెజరీకి పంపించే సమయం కూడా పూర్తి కావడంతో ఇక జూలై నెల జీతం కూడా అందదని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు.
క్రింది ఫొటోలో ఉన్న వీరఘట్టం మండలం కిమ్మి యూపీ పాఠశాలను ఎత్తివేసి ఈ పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా కూటమి ప్రభుత్వం మార్చింది. ఇందులో కొత్తగా వచ్చిన హెచ్ఎంతో కలిపి నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో ఇదివరకే పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు జూన్ నెల జీతాలు వచ్చాయి.కొత్తగా వచ్చిన హెచ్ఎంకు నేటి వరకు జీతం అందలేదు.
పొజిషన్ ఐడీలు ఇవ్వాలి
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గడిచి రెండు నెలలు కావస్తున్నా జీతాలు వేయకపోవడం ఏంటి? కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు పొజిషన్ ఐడీలు ఇచ్చి జీతాలు విడుదల చేయాలి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం 15 రోజుల పాటు ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. యాప్లో పదే పదే ఫొటోలు అప్లోడ్ చేసినా చాలా వరకు తిరస్కరించారు.అయినా సరే విసుగు చెందకుండా పనులను సక్రమంగా పూర్తి చేశాం. అంతేకాక సంబంధం లేని పనులను కూడా చేయాల్సి వస్తోంది. ఇంత చేసినా సకాలంలో జీతాలు వేయకపోతే ఎలా? వెంటనే జీతాలు విడుదల చేయాలి.
బంకురు అప్పలనాయుడు,
పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి, వీరఘట్టం
ఈ ఫొటోలో ఉన్నది వీరఘట్టం మండలం నడిమికెల్ల యూపీ పాఠశాల. దీన్ని అప్గ్రేడ్ చేసి ఉన్నత పాఠశాలగా మార్చారు. ఇక్కడ ప్రస్తుతం 12 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో నలుగురు ఉపాధ్యాయులకు ఇంత వరకు జీతాలు అందలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 1048 పాఠశాలలకు బదిలీపై వచ్చిన 1,150 మంది ఉపాధ్యాయలకు జీతాలు అందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చాలా దారుణం
బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు ఇంత వరకు జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణం. జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో దారుణ పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగిస్తున్న ప్రభుత్వం వారికి సకాలంలో జీతాలు వేస్తామని ఆలోచించకపోవడం చాలా అన్యాయం. బదిలీపై కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు వేయాలి.
మజ్జి పైడిరాజు,
యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, వీరఘట్టం

అయ్యవార్లకు అందని జీతాలు

అయ్యవార్లకు అందని జీతాలు

అయ్యవార్లకు అందని జీతాలు

అయ్యవార్లకు అందని జీతాలు