
ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ను కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం కలెక్టర్ను కలిసి సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. ఏనుగులతో కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, జియమ్మవలస, భామిని, సీతంపేట మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏనుగుల వల్ల ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో సుమారు రూ.1.50 కోట్ల ఎంపీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో బెలగాం రైల్వేగేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పరిసర గ్రామస్తుల ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
కలెక్టర్ను కోరిన ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి