ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష అక్రమ అరెస్ట్ ఆటవిక పాలనకు నిదర్శనం ఇలాంటి చర్యలతో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను భయపెట్టలేరు పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో సామాన్యులపై దౌర్జన్యాలు, దాడులు చేస్తూ రెడ్బుక్ పేరిట ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తక్షణమే దింపి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పెరిగిపోతున్న రెడ్ బుక్ అరాచకాలపై ఆయన విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, ఆయన కుమారుడిని పోలీసులు అర్ధరాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నాయకుడు నాగరాజు, అతని అనుచరులు దాడికి పాల్పడగా బాఽధితులను పరామర్శించడానికి ఎమ్మెల్యే వెళ్లారన్నారు. టీడీపీ గూండాలు ఎమ్మెల్యే విరూపాక్షపై సైతం దాడికి పాల్పడగా ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్కు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. నిందితులను వదిలేసి బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే విరూపాక్ష, ఆయన కుమారుడిని అరెస్టు చేశారని, బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్లను న్యాయస్థానాల్లో భద్రపరచాలని కోరారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. రెడ్బుక్ పేరిట ఈరోజు చేస్తున్న దారుణాలకు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు, దాడులతో వైఎస్సార్సీపీ క్యాడర్ను భయపెట్టలేరని, వారిని మరింత ఇబ్బంది పెడితే రానున్న రోజుల్లో వారు తమ మాట కూడా వినే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పుడు చేస్తున్న దాడులకు పదింతల సమాధానం చెప్పే ప్రమాదముందని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు కూడా కూటమి ప్రభుత్వానికి ఓ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటే తిరగబడి ఈ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని హెచ్చరించారు.


