ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో మూడు రోజులుగా జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారికి డ్రై ఫ్రూట్స్తో అలంకరించగా, అమ్మవారి ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కాయలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరో వైపున ఆషాఢ పౌర్ణమి నేపథ్యంలో తెల్లవారుజామున దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. శాకంబరీ ఉత్సవాలలో మూడు రోజులలో 45 టన్నుల కూరగాయలను ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం, ఇతర ఉపాలయాల అలంకరణకు వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడు రోజుల ఉత్సవాలలో మొత్తం 2.50 లక్షల మంది భక్తులు అమ్మవారికి శాకంబరీగా దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఉత్సవాలలో మొదటి రెండు రోజులు ఆకుకూరలు, కాయగూరలతోనూ, మూడో రోజున డ్రైఫ్రూట్స్తో అలంకరించారు. బంగారు గోపుర ప్రాకారం చుట్టూ బత్తాయిలు, కమలాలు, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్స్, యాపిల్, ఆల్బక్రా, ద్రాక్షలతో అలంకరించారు. శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు జరిగిన కదంబ ప్రసాద వితరణపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా కదంబ ప్రసాదాన్ని భక్తులకు అందించామని ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. రాజగోపురం ఎదుట మంచుతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
వైభవంగా గిరి ప్రదక్షిణ
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. కామథేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన ప్రచార రథానికి ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి గిరిప్రదక్షిణను ప్రారంభించారు.


