మంగళగిరి రూరల్: మంగళగిరి మండలం యరబ్రాలెం గ్రామంలో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని అనంతరం బెదిరింపులకు పాల్పడి నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.90 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన ఉదయ్ బెహరా యరబ్రాలెం పారిశ్రామికవాడ లో అల్యుమినియం కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతను సోషల్ మీడియాలో పోలో గే అనే డేటింగ్ యాప్ ద్వారా విజయవాడ కు చెందిన మహంకాళి కిషోర్, పచ్చిగోళ్ళ మోషే, పల్లేటి క్రాంతికుమార్లతో పరిచయం పెంచుకున్నారు. ఈ ముగ్గురు జూలై 26 అర్ధరాత్రి యరబ్రాలెంలోని ఉదయ్ బెహరా గదికి వెళ్లి బెదిరింపులకు పాల్పడి ఫోన్న్ పే ద్వారా రూ.90 వేలు, మరో బాధితుడి నుంచి రూ.800 బదిలీ చేయించుకున్నారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలతో నిందితులను గుర్తించి జూలై 28న అరెస్ట్ చేశారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులు ఎటువంటి అనుమతులు, బిల్లులు లేకుండా మట్టి తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేశారు. సాయంత్రం వరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. కొంతమంది టీడీపీ నాయకులు విజయవాడ నుంచి తాడేపల్లి పోలీస్స్టేషన్కు వచ్చి తిష్టవేసి లారీలను వదలాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. లారీలు అతివేగంగా వెళుతున్నాయని ఒక కారును ఢీకొట్టారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ లారీలను సీజ్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పట్టుకున్న లారీలపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు.


