శ్రీనివాసపురం పాఠశాల మూసివేత అదే దారిలోకి మరికొన్ని బడులు గణనీయంగా తగ్గుతున్న ప్రవేశాలు నిరుపేద విద్యార్థులకు అందని ప్రభుత్వ విద్య నాడు వైఎస్సార్ సీపీ హయాంలో వైభవం నేడు చంద్రబాబు సర్కారు వచ్చాక పెనుశాపం
గ్రామీణ విద్యకు పట్టుగొమ్మలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఒకదాని వెంట మరొకటి మూతపడుతున్నాయి. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో పేద చిన్నారులకు విద్య దూరం అవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పలు పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యాయి. దీంతో విద్యార్థులు ఉప్పెనలా పోటెత్తారు. నేడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సర్కారు విద్యాసంస్థలకు ముప్పు తప్పడం లేదు.
దాచేపల్లి: పేదలన్నా.. వారి బాగోగులు చూడాలన్నా చంద్రబాబుకు చిరాకనే విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు కొమ్ముకాయడం మినహా చేసేది ఏమీ లేదు. ఎప్పటిలాగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యాలయాలు మూసివేతకు గురవుతున్నాయి. నాడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వ విద్య కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయన కొరడా ఝుళిపించడంతో కార్పొరేట్ విద్యాలయాలు దారికొచ్చాయి. పేదల బడులు కళకళలాడాయి. నాడు–నేడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలతో తల్లిదండ్రుల మనసు గెలుచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోకపోవడంతో అవి మూతపడుతున్నాయి. విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా తగ్గుతున్నాయి.
దాచేపల్లి మండల పరిధిలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోగా.. మరికొన్ని పాఠశాలలు మూతపడ్డాయి. తాజాగా పొందుగల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపురం ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. విద్యార్థుల చేరికలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. ఒకప్పుడు ఈ పాఠశాల ఏర్పాటు కోసం గ్రామస్తులు ఒకే తాటిపైకి వచ్చి కృషి చేశారు. ప్రస్తుతం గ్రామంలో సుమారుగా 60 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. నిరుపేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కానీ పాఠశాలలో సరైన వసతుల కల్పన లేకపోవడంతో వారు కూడా ఆసక్తి చూపలేదు.
అత్యల్పంగా విద్యార్థుల సంఖ్య
పొందుగల ఉర్దూ పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే చదువుకుంటున్నారు. కొత్తగా విద్యార్థుల చేరికలు లేకపోవడంతో పాఠశాలను మూసివేస్తామని విద్యాశాఖ అధికారులు సమాచారం అందించారు. దీంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఈ పాఠశాలను మూసివేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా శ్రీనగర్ ప్రభుత్వ పాఠశాలలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. దాచేపల్లిలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో 17 మంది మాత్రమే చదువుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా అలుగుమల్లెపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు.


