జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. వాటిని పరిష్కరించకుండా టీడీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కార్యాలయాల్లో వసతుల లేమిపై క్రయవిక్రయదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గురజాల: కార్యాలయాల్లో ఇంటర్నెట్, సర్వర్లు తరచూ డౌన్ కావడం, ఆటో మ్యూటేషన్ ప్రక్రియలో జాప్యం వంటి సాంకేతిక సమస్యలతోపాటు పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే క్రయవిక్రయదారులు సర్వర్ సమస్యల కారణంగా కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తమ పనులు మానుకుని రిజిస్ట్రేషన్ కోసం ఒకటికి రెండుసార్లు రావాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేపట్టడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా...
పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, క్రోసూరు, అమరావతి, నరసరావుపేట, చిలకలూరిపేటల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, క్రోసూరు కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని శిథిలావస్థకు చేరాయి. మిగిలిన గురజాల, పిడుగురాళ్ల, అమరావతి, పెదకూరపాడు, నరసరావుపేట కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సర్వర్ సమస్యలు, ఇంటర్నెట్ అంతరాయాలు, ఆటో మ్యూటేషన్ ప్రక్రియలో ఆటంకాలు వంటివి తరచూ ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఒకటైనా, వాటి అభివృద్ధిపై నిర్లక్ష్యం కొనసాగుతోందని ప్రజలు అంటున్నారు. చలానాలు చెల్లించేందుకు, స్లాట్ బుకింగ్ చేసేందుకు సర్వర్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటీకరణ చేపట్టడం సమంజసం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 396ను రద్దు చేసి, కార్యాలయాల్లో క్రయవిక్రయదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
ఆదాయం వస్తున్నా సబ్ రిజిస్ట్రార్
కార్యాలయాల్లో వసతుల కొరత
సాంకేతిక ఇబ్బందులతో
ఆలస్యమవుతున్న రిజిస్ట్రేషన్లు
పరిష్కారంపై దృష్టి పెట్టని
చంద్రబాబు సర్కార్


