● అత్యధికంగా నరసరావుపేటలో
37,142 తొలగింపునకు ఏర్పాట్లు
● జిల్లా వ్యాప్తంగా చనిపోయిన
61,175 మంది ఓట్లు రద్దు
నరసరావుపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 17,41,798 ఉండగా.. 1,88,421 (10.82 శాతం) మంది ఓట్లు తొలగించనున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట నియోజకవర్గంలోనే అత్యధికంగా 37,142 ఓట్లు తగ్గనున్నాయి. జిల్లాలో మొత్తం తొలగించే పేర్లలో 61,175 ఓట్లు చనిపోయిన వారివే. సర్ కార్యక్రమం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. ఓటర్లు తమకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందజేసేందుకు 24వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. వాస్తవానికి బీఎల్ఓలు ఇంటికి వచ్చి ఫారాలు సేకరించాలి. అది ఎక్కడా జరగట్లేదు. ఫారాలు తమ వద్దకు తీసుకొచ్చి ఇవ్వాలని సూచిస్తున్నారు. జూలై 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో మొత్తం 17,41,798 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు.. 15,53,377 ఫారాలు (89 శాతం) డిజిటలైజేషన్ చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో దీనిపై సమావేశం కూడా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్తారని చెప్పారు. జూలై 24వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల మార్పు, హేతుబద్ధీకరణకు అవకాశం ఉందని తెలిపారు.


