అచ్చంపేట: మాదిపాడు పంచాయతీ పరిధిలోని అడవిలో స్వయంభు సత్తెమ్మ దేవాలయం చిన్న గుడి మాత్రమేనని, గుడికి ఎంత స్థలం కేటాయించారనే దానిపై ఫారెస్ట్ గెజిట్లో స్పష్టత లేదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ తెలిపారు. ‘సత్తెమ్మా... మన్నించమ్మా – సత్తెమ్మతల్లి ఆలయ అభివృదికి అటవీశాఖ మోకాలడ్డు ’ అనే శీర్షికతో సాక్షిలో బుధవారం ప్రచురితమైన వార్తకు ఫారెస్ట్ అధికారులు స్పందించారు. ఉదయాన్నే ఫారెస్ట్ రేంజ్ అధికారి వెంకటరమణ, డిప్యూటీ రేంజ్ అధికారి కుసుమ కుమారి, ఫారెస్ట్ గార్డు వరప్రసాద్ తదితరులు ఆలయం వద్దకు చేరుకుని దేవాలయ ఈఓ కోటేశ్వరరావుతో మాట్లాడారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇక్కడ గ్రామం ఉండేదని, వ్యవసాయ భూములు ఉండేవని కొంతమంది చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఫారెస్ట్ గెజిట్ రికార్డులను పరిశీలిస్తే అలాంటివేమీ లేవన్నారు. దేవాలయం 12 సంవత్సరాల క్రితం దేవదాయ శాఖలోకి వచ్చిందన్నారు. ఆలయానికి ఎంత స్థలం కేటాయించారనే దానిపై కూడా స్పష్టత లేదన్నారు. ఏ విధమైన కట్టడాలు నిర్మించాలన్నా అటవీశాఖ నుంచి అనుమతి తీసుకోవలసిందేనన్నారు. గతంలో ఎకో పార్కు నిర్మించాలనుకున్నామని, నిదులు మంజూరు కాకపోవడంతో నిర్మించలేదన్నారు. ఆన్లైన్ ద్వారా ఫారెస్ట్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ


