జిల్లా కలెక్టర్కు ఎమ్మార్పీఎస్ఎస్ నేతల వినతి
నరసరావుపేట: త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పంచాయతీ సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్ల ఎన్నికల్లో జిల్లాలో అధికంగా ఉన్న మాదిగలకు సీట్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి) జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. మీరయ్య మాట్లాడుతూ గత 31 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణను మాదిగలు పోరాడి సాధించుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత తొలిసారిగా స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయని, జిల్లాలో ఎస్సీల్లో మాదిగలు అధికంగా ఉన్నందున ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం ఎక్కువ సీట్లు మాదిగలకే కేటాయించాలన్నారు. కొన్ని గ్రామాల్లో అగ్రకులస్తులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినా గాని రాజకీయం పలుకుబడితో రిజర్వేషన్లు మారుస్తున్నారని అన్నారు. చిలకలూరిపేట, గురజాల, దాచేపల్లి, వినుకొండ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్: చెల్లని చెక్కు కేసులో నేరం రుజువు అవడంతో దిగువకోర్టు విధించిన ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ. 8 లక్షలు ఫిర్యాదుకి నష్టపరిహారంగా చెల్లించేలా విధించిన శిక్షను స్థానిక 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయాధికారి ఎస్. రమేష్ సోమవారం ఖరారు చేశారు. మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన రావూరి వెంకట సిద్దయ్య వద్ద నరసరావుపేటకు చెందిన ఒడుగు నాగూర్ బాబు 2017 జనవరి 5వ తేదీన రూ. 3,50,000 అప్పుగా తీసుకున్నాడు. దీనికి గాను ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు. చెల్లింపులో భాగంగా అదే ఏడాది అక్టోబర్ 24న రూ. 4 లక్షలకు చెక్కు ఇచ్చాడు. ఫిర్యాది సిద్దయ్య సదరు చెక్కును తన బ్యాంక్ ఖాతాలో వసూలుకు జమచేశాడు. సరిపడా నిధులు లేక చెక్కు బౌన్స్ అయింది. ఈ మేరకు కోర్టులో కేసువేయగా, విచారణలో నేరం రుజువు కావడంతో పై విధంగా అప్పటి నరసరావుపేట రెండవ అదనపు జూనియర్ అధికారి జె.అంజయ్య తీర్పు వెలువరించారు. నిందితుడు నాగూర్ బాబు సదరు తీర్పుపై జిల్లా కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నాడు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం దిగువ కోర్టు తీర్పును యధాతథంగా ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.


