నరసరావుపేట: పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) విభాగంలో పదవ తరగతి అర్హతతో భర్తీ చేయనున్న 22 ఔట్సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గందరగోళంగా మారిందని నిరుద్యోగ యువతీ, యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది అభ్యర్థులు జిల్లా ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ దరఖాస్తులు ఎవరికి అందజేయాలి, ఎక్కడ సమర్పించాలి అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడం అభ్యర్థులను గంటల తరబడి నిరీక్షింపజేయడం పట్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మౌనం కారణంగా నియామక ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగంపై ఆశతో ఖర్చుల భరించి కిలోమీటర్లు దూరం ప్రయాణించి కార్యాలయానికి వచ్చిన తమను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై పూర్తి స్పష్టత ఇవ్వాలని, నియామకాలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని నిరుద్యోగ యువతీ, యువకులు డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగుల్లో పెరుగుతున్న అనుమానాలు


