జిల్లాలో సాగు ఇలా.... | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో సాగు ఇలా....

Jun 19 2026 2:18 AM | Updated on Jun 19 2026 2:18 AM

జిల్లాలో సాగు ఇలా....

తెనాలి/కొల్లిపర: తొలకరి చినుకుల సవ్వడితో మెట్ట రైతులు పసుపు సాగుకు సమాయత్తం అవుతున్నారు. అడపాదడపా వర్షాలతో నేల పదునుతో లంక ప్రాంతాల్లో పసుపు విత్తటానికి శ్రీకారం చుడుతున్నారు. మిగిలిన చోట్ల నేలను సిద్ధం చేసుకోవటం, విత్తన సేకరణ సన్నాహాల్లో ఉన్నారు. ఎండు పసుపునకు మార్కెట్‌ ధర ఆశాజనకంగా ఉండటంతో ఈసారి కొంత విస్తీర్ణం పెరిగేలా ఉంది. దీంతోపాటు కొందరు రైతులు తమ చేలల్లో 5–10 సెంట్ల విస్తీర్ణంలో సొంత అవసరాలకు మిరప, టామాటా, వంగ నారుమళ్లు చేస్తున్నారు.

సిద్ధంగా విత్తన పసుపు...

ఏటా పసుపు సాగుకు ముందు కడప జిల్లా నుంచి రైతులు, మధ్యవర్తులు పచ్చి పసుపును తీసుకొచ్చి కొల్లిపర మండల గ్రామం తూములూరులో నిల్వచేయటం తెలిసిందే. తొలకరి వర్షం రాగానే జిల్లాతోపాటు పరిసర జిల్లాల్లోని రైతులు ఇక్కడి నుంచి విత్తనం పసుపు కొనుగోలు చేస్తుంటారు. ఈసారి పసుపు విత్తనం పుట్టి (225 కిలోలు) ధర రూ.7,500 నుంచి రూ.8,500 వరకు అమ్మకాలు చేస్తున్నారు.

విస్తీర్ణం పెరిగే అవకాశం ....

ఎండు పసుపు ధర రెండేళ్లుగా మార్కెట్‌లో క్వింటా రూ.7 వేల వరకు ఉంది. ఈ సంవత్సరం మార్కెట్‌లో పసుపు ధర క్వింటా రూ.10– రూ.14 వేల వరకు కొనుగోళ్లు జరిగాయి. గత ఆరు నెలల నుంచి ధర కాస్త అటూఇటుగా నిలకడగా ఉంది. రానున్న సీజనులో ధర బాగుంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. దీంతో పచ్చి పసుపు ధర పుట్టి రూ.8 వేల వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి సాగుకు సమాయత్తం అవుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే 2026–27 సీజనులో పసుపు విస్తీర్ణం పెరుగుతుందన్న అంచనా ఉంది.

కొత్త వంగడాలపై రైతుల ఆసక్తి...

అధిక దిగుబడులతోపాటు నాణ్యమైన పంట సాగు కోసం రైతులు నూతన రకాలపై ఆసక్తి చూపుతున్నారు. తెగుళ్లను, తేమను తట్టుకొనే పసుపు రకాలైన నిజామాబాద్‌, మైదుకూరు, సేలం, టేకూరుపేట వంటి రకాలను సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. వీటితోపాటు కుర్కుమిన్‌ శాతం అధికంగా ఉండే పసుపు విత్తన సేకరణకూ సన్నాహాలు చేస్తున్నారు. కొల్లిపర మండలం లంక గ్రామాల్లో ఇప్పటికే కొందరు రైతులు పసుపు విత్తటం పూర్తి చేశారు.

గుంటూరు జిల్లాలో పసుపు సాగు సాధారణ విస్తీర్ణం 4,500 ఎకరాలు ఉంది. 2024లో 3,616 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పసుపు సాగు చేశారు. 2025లోనూ కొంచెం విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో అత్యధికంగా పసుపు సాగు తెనాలి వ్యవసాయ సబ్‌ డివిజనులోనే చేస్తుంటారు. ఇందులోనూ కొల్లిపర మండలంలోనే ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. గతేడాది కొల్లిపర మండలంలో 1,950 ఎకరాలు, దుగ్గిరాలలో 234, తెనాలిలో 133 , మంగళగిరిలో 405, మేడికొండూరులో 222, తాడేపల్లిలో 365 ఎకరాలలో సాగు చేశారు. మిగిలిన మండలాల్లో అక్కడక్కడ 20 ఎకరాలలోపు సాగు చేశారు. దీంతో మొత్తం సుమారు 3,343 ఎకరాల్లో పంట సాగయింది. 2024లో మార్కెట్‌లో ఎండు పసుపు సరైన ధర లేకపోవటంతో కొందరు రైతులు ఇతర పంటలకు మళ్లారు. ఫలితంగా 2025లో కొంత మేర సాగు విస్తీర్ణంం తగ్గింది. ఈ సారి మార్కెట్‌లో పసుపు రేటు బాగానే ఉంది.

లంక గ్రామాల్లో సాగు ఆరంభం

విత్తన పసుపునకు గిరాకీ

కొనుగోళ్లతో తూములూరు కళకళ

కొత్త రకాలపైనా రైతుల ఆసక్తి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement