వినుకొండ: వినుకొండ మండలంలోని వెంకుపాలెం గ్రామంలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు అలియాస్ చిన్న బుజ్జి (29) అక్కడికక్కడే మృతి చెందగా, గుడిపాటి బాలకోటయ్య, యలగాల శ్రీను, చెన్నుబోయిన కోటయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలించారు. వ్యవసాయ పొలంలో ఉండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ఘటన జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
మరో ఘటనలో...
శావల్యాపురం: మండలంలోని కారుమంచి గ్రామంలో సాయంత్రం ఊరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో పిడుగుపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు మేరకు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన మల్లపరపు చిన కోటేశ్వరరావు (55) గేదెలు మేత కోసం పొలానికి వెళ్లాడు. పొలంలో గేదెలు మేత మేస్తుండగా అకస్మాతుగా పిడుగుపాటుకు గురై సంఘటన స్థలం మృతి చెందాడు. గేదెలు మాత్రం యథావిధిగా ఇంటికి వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతుకుతుండగా పొలంలో మృతదేహం గుర్తించారు. మృతుడుకి భార్య ముగ్గురు సంతానం కలరు. కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి.
పది గొర్రెలు కూడా...
వినుకొండ: పట్టణంలో ఉరుములు, మెరుపులు, ఈ దురుగాలులతో కూడిన భారీ వర్షంతోపాటు పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో నాగమయ్య పుట్ట వద్ద చెట్టుపై పిడుగుపడటంతో చెట్టు కింద ఉన్న మేకల నరేంద్ర, మేకల శ్రీనుకు చెందిన 10 గొర్రెలు మృతి చెందాయి. మృతిచెందిన గొర్రెల విలువ సుమారు రూ.లక్షకుపైగా ఉంటుందని బాధితులు తెలిపారు.
గుడిపాటి కోటేశ్వరరావు,
మల్లవరపు చిన కోటేశ్వరరావు మృతదేహాలు
మరో ముగ్గురికి తీవ్రగాయాలు


