మంత్రి టీజీ భరత్
చిలకలూరిపేట: ఆటోనగర్ కార్మికులకు అవసరమైన నైపుణ్యాలు, ఆర్థిక సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. మండలంలో పోతవరం గ్రామం వద్ద ఆటోనగర్ను గురువారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆటోనగర్ అభివృద్ధికి అవసరమైన రూ. 2.80 కోట్ల నిధులు త్వరగా మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటో వర్కర్స్ పనితీరు మెరుగుపడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో లభించే ఆధునిక పరికరాలు, యంత్రాలతో కార్మికుల కష్టం తీరుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఆటోనగర్లో ప్లాట్లు పొందిన వారు ఆటోనగర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎంఎస్ఎంఈ పార్కులకు దీటుగా ఆటోనగర్ అభివృద్ధి చెందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీచైర్మన్ షేక్ కరిముల్లా, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ సువర్ణఫణి పాల్గొన్నారు.


