గుంటూరు లీగల్: ఈశాన్య ప్రాంతాల నుంచి వలస వచ్చిన ప్రజల కోసం ఇన్చార్జి చైర్మన్ ఒకటో అదనపు జిల్లా జడ్జి వీఏఎల్.సత్యవతి చేతులమీదుగా లీగల్ ఎయిడ్ క్లినిక్ను జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ క్లినిక్ ద్వారా న్యాయ సేవలు మరింత విస్తృతం చేయవచ్చని పేర్కొన్నారు. న్యాయవాదులను, పారా లీగల్ వలంటీర్లను నియమించనున్నట్లు వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ ఈ ప్రత్యేక క్లినిక్ ఉద్దేశం ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉంచడమేనన్నారు. ప్యానెల్ అడ్వొకేట్స్, పారా లీగల్ వలంటీర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


