కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: జిల్లావ్యాప్తంగా క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో అభ్యుదయం కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మండలానికి ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ క్లస్టర్ అభివృద్ధి చేసి ఎఫ్పీఓలతో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఒక్కో క్లస్టర్కు రూ.3కోట్ల వరకూ సబ్సిడీతో రూ.5కోట్లవరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికి బెల్లంకొండ, అచ్చంపేట, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడు ఐదు క్లస్టర్లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, పెండింగ్లో ఉన్న క్లస్టర్లకు త్వరగా రుణాలు మంజూరు చేయాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద సబ్సిడీ రుణాల ప్రాసెసింగ్ పూర్తిచేసి ఆరు నెలల్లోగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, ఎల్డీఎం రామ్ప్రసాద్ పాల్గొన్నారు.
అంగన్వాడీల్లో విజయవంతంగా
న్యూట్రీగార్డెన్లు..
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్ల నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. సోమవారం న్యూట్రీ గార్డెన్ల నిర్వహణపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖాళీ స్థలం అందుబాటులో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకు కూరల పెంపకం చేపట్టి, వాటితో వండిన ఆహారాన్ని అందించే కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందన్నారు. ఇదే తరహాలో జిల్లాలోని అన్నిపాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్లు నిర్వహించాలని ఆదేశించారు. కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్లు మహిళలకు ఏటీఎం (ఎనీ టైం మనీ)లాగా పనిచేసే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. ఏపీ సీఎన్ఎఫ్ పీడీ అమలకుమారి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డ్వామా పీడీ సిద్ధలింగ మూర్తి, డీపీఓ నాగేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


