న్యూస్రీల్
14416 నంబర్ ఉందిగా...
సాగర్ నీటిమట్టం
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
విజయం కన్నా ప్రాణం మిన్న
● టెన్త్ పబ్లిక్ పరీక్షల
ఫలితాల నేపధ్యంలో..
● విద్యార్థులు, తల్లిదండ్రులు
సంయమనం పాటించాలి
● పరీక్షలు, మార్కులే జీవితంగా
భావించొద్దు
● ఓటమి విజయానికి
తొలిమెట్టుగా భావించాలి
● సమాజంలో మార్పుతెచ్చే
మార్గాలు ఎన్నో..
● జిల్లాలో టెన్త్ పరీక్ష రాసిన 25,167
మంది రెగ్యులర్, 1,087 మంది
దూరవిద్య విద్యార్థులు
సత్తెనపల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లల మార్కులనే వారి పరువు, ప్రతిష్టలుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇతర విద్యార్థుల మార్కులతో పోల్చుతూ వారూ అలా సాధించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంట్లో కొందరు విద్యార్థులు విజయం సాధిస్తున్నప్పటికీ చాలామంది వెనుకబడిపోతూ తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే ఆత్మన్యూనతా భావనతో ఆందోళనలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే పరీక్షల్లో మార్కులు పిల్లల భవితను, వారి సామర్థ్యాన్ని నిర్ణయించే కొలమానంగా చూడొద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పదో తరగతిలో ఒకసారి, ఇంటర్లో రెండుసార్లు ఫెయిలైన రాజస్థాన్కు చెందిన అంజుశర్మ కుంగిపోకుండా పట్టుదలతో చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. అదే ఊపుతో ఎంబీఏ పూర్తి చేసి సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్కు ఎంపికయ్యారు.
జిల్లావ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత నెల 16న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 25,167 మంది రెగ్యులర్ విద్యార్ధులు, 1,087 మంది దూరవిద్య విద్యార్థులు పరీక్షలు రాశారు. వారు అంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు ఒక విషయం గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిభను నిర్ణయించేంది ఒక పేపర్ మీద ఉండే అంకెలు కాదని, ప్రతి విద్యార్థిలో ఉండే పట్టుదల, పోరాట గుణమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మార్కులే జీవితం కాదనే అంశంపై పిల్లలను చైతన్య పరచాలని మేధావులు, విద్యావేత్తలు అంటున్నారు. పలు కారణాలతో పరీక్ష తప్పిన వారు క్షణికావేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదని, మార్కులే జీవితం కాదని సూచిస్తున్నారు. ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలిమెట్టు లాంటిదని అంటున్నారు. పరీక్షల్లో ఎందుకు తప్పాం? లోపం ఎక్కడ ఉంది? అనే అంశాలను విశ్లేషించుకుని అడుగు ముందుకేస్తే అడ్వాన్స్ సప్లిమెంటరీలో తిరిగి ఉత్తీర్ణత సాధిస్తారని అంటున్నారు.
● పరీక్ష మీ తలరాతను మార్చలేదు
● అపజయం అనేది మరింత నేర్చుకునేందుకు ఒక అవకాశం
● మీ ప్రాణం, ఆరోగ్యం ముందు ఏదీ విలువైనది కాదు
● పిల్లలు వారి సమస్యలు చెప్పుకునే చొరవ ఉండేలా చిన్నతనం నుంచే స్నేహ పూర్వకంగా వారితో తల్లిదండ్రులు మెలగాలి.
● ఓటమి నుంచే విజయం వరిస్తుందని .. స్ఫూర్తి పొందే విజయ గాథలు వివరించాలి.
● పరీక్షల్లో ఫెయిలైనా .. మార్కులు తక్కువొచ్చినా .. తర్వాత ప్రయత్నించవచ్చని ప్రోత్సహించాలి.
● జీవితంలో, చదువులో ప్రతికూల ఫలితాలు సర్వసాధారణమనే విషయాన్ని వారికి చెప్పాలి.
● అపజయాలకు కుంగిపోతే జీవితం ఎలా నాశనం అవుతుందో ఉదాహరణలతో వివరించాలి.
● ఏ అంశంలోనూ ఇతర పిల్లలతో పోల్చి చూడకూడదు.
● అపజయం ఎదురైనప్పుడు పిల్లల్లో వివిధ అంశాల్లో ఉండే ప్రతిభను వివరిస్తూ ధైర్యం నింపాలి.
● ఓటమి తర్వాత వచ్చే గెలుపు రుచి ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుందని ప్రోత్సహించాలి.
తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ టెలి మానసన్ అందుబాటులోకి తెచ్చింది. 14416 నెంబర్ కు ఫోన్ చేసి కుంగుబాటు, మానసిక ఆందోళన, నాకు జీవితం ఎందుకు అనిపించినా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చుట్టుముడుతున్నా వెంటనే టెలిమానస్కు ఫోన్ చేస్తే.. కౌన్సిలర్లు ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయమట్టం బుధవారం 525.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 450 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది.
ఫలితం ఎలా వచ్చినా .. ఆత్మాన్యూనతా భావంతో మానసికస్థైర్యం కోల్పోరాదు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చరాదు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ముందున్న విస్త్రృత అవకాశాలు తెలిసే అవకాశముంటుంది. ఓటమి కూడా భవిష్యత్తులో సాధించబోయే విజయానికి తొలిమెట్టు. పాస్, ఫెయిల్ సాధారణ విషయాలే అయినా వ్యక్తిగత ప్రతిష్టకు పోయి తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయరాదు. విద్యార్థులు సైతం ప్రతికూలంగా ఉన్న ఫలితాలపై ఎలాంటి ఆందోళన చెందకుండా పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు.


