సత్తెనపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు, ఆంధ్ర గాంధీగా పేరు పొందిన వావిలాల గోపాలకృష్ణయ్య అందరికీ ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కొనియాడారు. వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని వావిలాల స్మృతి వనంలో బుధవారం నివాళులర్పించారు. అంబటి మాట్లాడుతూ దేశం కోసం వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన పోరాటాలు, ఉద్యమాలను తెలుగు వారందరూ స్మరించుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, సీనియర్ న్యాయవాది పక్కాల సూరిబాబు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమానికి, తెలుగు భాషాభివృద్ధికి ఆయన అవిరళ కృషి చేశారని కొనియాడారు. తొలుత మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నాయకులు వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వావిలాల మనవడు మన్నవ సోడేకర్, పార్టీ సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు నక్కా శ్రీనివాసరావు, రాజుపాలెం మండల నాయకుడు మర్రి సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలకా జైపాల్, ట్రేడ్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు వల్లెం నరసింహారావు, ధూళ్ళిపాళ్ల ఆంధ్ర బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లబోతు శివన్నారాయణ ఉన్నారు.


