యడ్లపాడు: బాల్య వివాహం అనే సామాజిక మహమ్మారి బారి నుంచి ఓ బాలిక భవితను ఐసీడీఎస్ అధికారులు సమయస్ఫూర్తితో కాపాడారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉప్పరపాలెంలో ఓ బాలికకు పెళ్లి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న సమాచారంతో యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. బుధవారం రోజు బాలికకు నిశ్చయ తాంబూలాలు చేస్తున్నట్లు ముందురోజు రాత్రి బాలిక బంధువుల నుంచి అందిన ఫోన్ కాల్పై తక్షణమే స్పందించారు. ఐసీడీఎస్ వంకాలయపాడు సూపర్వైజర్ ఆర్.సామ్రాజ్యం, తన సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో కలిసి బుధవారం ఉదయాన్నే ఆ ఇంటికి చేరారు. బాలిక తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడి, చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను వివరించారు. చట్టపరంగా వారు ఎదుర్కోవాల్సిన కఠిన చర్యలను తెలియజేస్తూ హెచ్చరించారు. అధికారుల కౌన్సెలింగ్తో మనసు మార్చుకున్న తల్లిదండ్రులు, తమ కుమార్తెకు మైనారిటీ తీరే వరకు ఎలాంటి వివాహ ప్రయత్నాలు చేయబోమని అధికారులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వర్లు, డీసీపీయూ సభ్యులు నానమ్మ, వంకాయలపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి బాపిరాజు, నీడ్ సంస్థ ఎన్జీవో ప్రేమ్కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు సుబ్బాయమ్మ, కోటేశ్వరి ఉన్నారు.


