బాపట్ల: ప్రతి వ్యవసాయ విద్యార్థికి నాణ్యమైన విద్యను నైపుణ్యంతో కలిపి అందించే ప్రణాళికతో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందడుగు వేస్తోందని ఉప కులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ అన్నారు. ప్రతి పట్టభద్రుడికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ‘‘పరిశోధన మరియు వాస్తవాల మధ్య వారధి: స్థిరమైన రైతులు, ఆహార వ్యవస్థలు, సమాజ సంక్షేమం కోసం స్మార్ట్ ఆవిష్కరణలు’’ అనే అంశంపై బాపట్ల వ్యవసాయ కళాశాలలో మంగళవారం పీజీ విద్యార్థుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీనికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశ జనాభా 37 కోట్లని, నేటికి 6.5 రెట్లు జనాభా పెరిగినప్పటికీ 540 బిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి శాస్త్రవేత్తలు, రైతుల వలన సాధ్యమైందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ప్రపంచ స్థాయిలో 18 శాతం ఉంటే, భారత్లో అది 12 శాతంగా ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు.
అధిక మోతాదుతో నేలపై దుష్ప్రభావం
వ్యవసాయ విద్యార్థుల వాస్తవిక గణాంకాలను తెలుసుకుంటే క్షేత్ర స్థాయిలోని సమస్యలు అవగతం అవుతాయన్నారు. పూర్వీకులు సేంద్రియ వ్యవసాయ విధానం చేయడం వలన పౌష్టికాహారాన్ని తీసుకోగలిగారని చెప్పారు. ప్రస్తుతం ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉంటున్నాయని తెలిపారు. అధిక మోతాదులో ఎరువులను, పురుగు మందులను వాడటం వలన నేలపై దుష్ప్రభావం పెరుగుతుందని చెప్పారు. భూమి యొక్క ఉత్పాదకత, సారవంతతను కోల్పోయే తీవ్రమైన పర్యావరణ సమస్యగా ఇది పరిణమిస్తుందని తెలిపారు. భూగర్భ జలాల వాడకం విషయంలో కూడా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. నేలలు నిస్సారంగా మారి, వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయన్నారు. రైతు సంక్షేమానికి చాలా కీలకమైన నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అధిక దిగుబడులను ఇచ్చే రకాలను రూపొందించుకునేలా పరిశోధనలు సాగాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ డిగ్రీని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టామని తెలిపారు. కార్యక్రమంలో పరిశోధనల ముఖ్యాంశాలతో కూడిన ప్రతులను ముఖ్య అతిథులు, మాజీ ఉప కులపతి డా.సూరపనేని కోటేశ్వరరావు ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 14 విశ్వ విద్యాలయాలకు చెందిన 810 మంది పి.జి. విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించి, సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాశ్రీశ్రీ ఏవీ రమణ, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాశ్రీశ్రీ జి.రామచంద్ర రావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాశ్రీశ్రీ డి.సంపత్ కుమార్, అసోసియేట్ డీన్ డాశ్రీశ్రీ పి. ప్రసూనారాణి తదితరులు సదస్సు ముఖ్య ఉద్దేశాలను వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ కార్యదర్శి డాశ్రీశ్రీ కె. శ్రీనివాసులు, స్టూడెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాలాజీ, డాశ్రీశ్రీ ఎన్.టి.ఆర్. కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అసోసియేట్ డీన్ డాశ్రీశ్రీ డి.డి.స్మిత్, డాక్టర్ ఎన్.టి.ఆర్. కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ డాశ్రీశ్రీ ఎం.సర్దార్ బేగ్, డాశ్రీశ్రీ లాల్ అహమద్ మొహమ్మద్, డాశ్రీశ్రీ టి.వి.శ్రీధర్, స్టూడెంట్ టీచర్ కో ఆర్డినేటర్ డాశ్రీశ్రీ డి.వి.ఎస్. అక్షయ్, స్టూడెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


