మాచర్ల రూరల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడి ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధిలోని రాయవరం జంక్షన్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మాచర్ల నెహ్రూనగర్కు చెందిన 11 మంది కూలీలు ఆత్మకూరు గ్రామానికి చేలో కూలీ నిమిత్తం ఆటోలో బయలుదేరి వెళ్ళారు. పోలేపల్లి గ్రామ సమీపంలో పెట్రోల్ బంకు దాటిన తరువాత ఆటో డ్రైవర్ పక్కనే ఉన్న మహిళా కూలీ తను డ్రైవింగ్ చేయాలని అడుగగా ఆమెకు స్టీరింగ్ ఇచ్చాడు. ఆమె వేగంగా నడుపుతూ స్టీరింగ్ కంట్రోల్ కాకపోవటంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జంగం కార్తీక్, మున్నా పాపమ్మ, షేక్ మలాం బీ, షేక్ సైదా బీ, గంగమ్మ తదితర ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


