నరసరావుపేట రూరల్: ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన కల్పించాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. సాగు విషయాన్ని రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రచారం చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో అమలకుమారి మాట్లాడుతూ.. ఈ ఏడాది 82,595 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ కోసం 30 రకాల విత్తనాలతో ఎకరానికి 15 కిలోల కిట్లను బయోరీసోర్స్ సెంటర్లు, రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా భూమి సారవంతం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్ధ్యం మెరుగుపడుతుందని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందులు పూర్తిగా వదిలి, సేంద్రియ సాగుతో కషాయాల వినియోగం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగవుతుందని వివరించారు. దీని వలన రైతులకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, మిర్చి, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు వేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎన్ఎఫ్ఏలు నందకుమార్, అప్పలరాజు, మేరి, ఎంఎంటీఎల్ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


