నాదెండ్ల: జాతీయ రహదారిపై పత్తి బేళ్ల లారీ దగ్ధమైన సంఘటన బుధవారం గణపవరం వద్ద చోటుచేసుకుంది. చిలకలూరిపేట ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ గౌస్ తెలిపిన వివరాల మేరకు యడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలోని సప్తగిరి గోడౌన్లలో మధ్యాహ్నం ఒంటి గంట సమీపంలో 16 టన్నుల రెండో రకం పత్తి బేళ్లను కూలీలు కంటెయినర్ లారీలో లోడ్ చేశారు. లారీ తిమ్మాపురం నుంచి హరియాణాలోని ఓ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. లోడింగ్ అనంతరం వే బ్రిడ్జి కాటా వేసుకుని ఇన్వాయిస్లు తీసుకుని లారీ బయలుదేరింది. గణపవరం వద్దకు చేరుకునే సరికి క్యాబిన్లో పొగలు వచ్చాయి. డ్రైవర్ గమనించి లారీని పక్కకు నిలిపివేసి కంటెయినర్ డోర్ తెరిచాడు. దట్టమైన పొగ అలముకోవటంతో అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. లారీని జాతీయ రహదారికి దూరంలో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి జేబీలతో బేళ్లు బయటకు లాగారు. అప్పటికే 60 శాతం పైగా అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదంపై మోహిత్ కాటన్ మిల్స్ యజమాని అవినాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో దగ్ధమైన బేళ్ల విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
రూ.10 లక్షల ఆస్తి నష్టం


