రేపల్లె: రేపల్లె పట్టణ గ్రామదేవత బూరగలమ్మ వారి పుష్కర కుంభా భిషేక మహోత్సవం నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం సోమవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతుందని ఆలయ అర్చకుడు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు ఆదివారం తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకమారు ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయని, దీనిలో భాగంగా విశేష పూజలతోపాటు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 25వ తేది ఉదయం 9.50 గంటలకు ఆలయ శిఖరానికి, అమ్మవారికి ఏకకాలంలో అభిషేకం జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.
చేబ్రోలు: మానవాళి రక్షణకు ఏసుక్రీస్తు శిలువ శ్రమలు పొంది, శిలువపై రక్తం చిందించి మరణించి సర్వ మానవాళికి రక్షణ అందించారని చేబ్రోలు చీలిపాలెంలోని పునీత అంతోనివారి దేవాలయం ఫాదర్ మల్లవరపు బాలశౌరి తెలిపారు. చేబ్రోలులో ఆదివారం ఘనంగా శిలువ యాత్ర కార్యక్రమం చేపట్టారు. పాతరెడ్డి పాలెం, గొడవర్రు, కోవెలమూడి, లేమల్లె పాడు, కొత్తరెడ్డిపాలెం నుంచి వందలాది మంది విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభువు శిలువ శ్రమలను కళ్లకు కట్టే విధంగా నాటక రూపంలో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. పొన్నూరు ఆశ్రమానికి చెందిన బ్రదర్ జాక్ (గోతాలస్వామి) సందేశాన్ని అందజేశారు. కార్యక్రమానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చేశారు. కమిటీ పెద్దలు, సంఘస్తులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాల్గో రోజైన ఆదివారం జగన్మాతకు మందార పుష్పాలు, ఎర్రకలువలు, చామంతులతో అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో అధికారులు, అర్చకులు ప్రధాన ఆలయంలోని మూల విరాట్ను దర్శించుకున్నారు.


