తక్షణ చర్యలతో అరటికి రక్షణ
కొల్లిపర: మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు అరటి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కువ శాతం మండలంలో అరటి గెలలు ఉన్న పంటపై అధికంగా ప్రభావం చూపింది. రైతులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటే మిగిలిన పంటను రక్షించుకునే అవకాశముందని తెనాలి ఉద్యానశాఖ అధికారి తోటకూర శ్రీనిత్య తెలిపారు.
● చిన్న మొక్క తోటల్లో మురుగు నీరు బయటకు పోయే విధంగా దారులు చేసి, నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పంట పది గంటలకు మించి ముంపునకు గురయితే అధిక శాతం మొక్కలు చనిపోయే అవకాఽశం ఉంది. అందువల్ల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.
● పంట తేరుకోవడానికి లీటరు నీటికి 5గ్రాముల పొటాషియం నైట్రేట్ కలపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 3–4 సార్లు పిచికారీ చేయాలి. ఎకరానికి అదనంగా 20 కిలోల యూరియా, 15కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి.
● అరటి తోటలో అరుదల వచ్చేలా చూడాలి. ట్రైకోడేర్మా విరిడీ జీవ నియంత్రకాన్ని ఎకరానికి 2కిలోల చొప్పున 100 కిలోల పశువుల ఎరువుతో గానీ, వర్మి కంపోస్ట్తో గానీ కలిపి చల్లుకోవాలి.
● మూడు నెలలు కంటే చిన్న వయసు గల మొక్కలు 5–6 రోజులపాటు 2–3 అడుగుల లోతు నీటిలో మునిగినప్పుడు వేరు వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయే ప్రమాదముంది. నీరు బయటకు పంపిన వెంటనే మొక్కలను తీసి వేయాలి. నేల ఆరిన తురువాత తేలికపాటి దుక్కి చేయాలి. 45–45–45 సెం.మీ. పొడవు, వెడల్పు, లోతు గల గుంతలు తీసి టిష్యూ కల్చర్ లేదా విత్తన శుద్ధి చేసిన తెగుళ్లు లేని సూది పలకలను మళ్లీ నాటుకోవాలి.
● ఐదారు నెలల వయసు ఉండి గెలలు వేసే దశలో ఉన్న మొక్కలు ఐదు రోజుల కంటే ఎక్కువగా, మూడు అడుగుల నీటి లోతులో ఉన్న మొక్కల వేరు వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోతుంది. ఇటువంటి మొక్కలు నీరు ఆరిన తరువాత కూడా బతకడం కష్టం
● ఐదు రోజుల కంటే తక్కువగా నీటి ముంపునకు గురి అయినప్పుడు వేరు వ్యవస్థ పాక్షికంగా దెబ్బతింటుంది.
● గాలిలో అధిక తేమ కారణంగా తెల్ల చక్కెర కేళి, గ్రాండైన్, వామన కేళి వంటి రకాలలో సిగటోకా ఆకుమచ్చ తెగులు అధికంగా ఆశించడానికి అవకాశాలు ఉన్నాయి. నేలలో అధిక తేమ వలన బ్యాక్టీరియా దుంప కుళ్లు ఆశించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● అరటి రైతులు సాధ్యమైనంతగా ముంపు నీటిని మురుగునీటి కాల్వల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేయాలి. నేల ఆరిన తరువాత అంతర సేద్యం చేయాలి. మొక్క ఒక్కింటికి 100 గ్రాముల యూరియా, 80గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20–25 రోజుల వ్యవధిలో 3నుంచి 4 దఫాలుగా వేయాలి.
● ఆకులు తడిసే విధంగా ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్ ఒక లీటరు నీటికి చొప్పున తగినంత జిగురు కలపి వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి. సిగటోకా ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రోపికొనజోల్ 1 మి.లీ. మందును లీటరు నీటికి కలపి జిగురుతో పాటు పిచికారీ చేయాలి.
● అరటి దుంపలు కుళ్లిపోకుండా నివారించడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి లేదా బోర్డో మిశ్రమం ఒక శాతం దుంప చుట్టూ తడిసే విధంగా పోయాలి.
● దుంపకుళ్లు ఆశించిన మొక్కలను గమినించి, వాటి చుట్టూ 25గ్రాముల బ్లీచింగ్ పొడి ఒక లీటరు నీటిలో కలపి మొదలు తడిసేలా పోయాలి. అవసరాన్ని బట్టి 15–20 రోజుల మధ్యలో మళ్లీ పోయాలి. తర్వాత ఈ మొక్కల మొదళ్లలో 50 గ్రాముల సూడోమోనాస్. 250గ్రాముల వేపపిండితో కలపి వేయాలి.
● పూర్తిగా గెలలు విడిచిన, 75 శాతం లోపల గెల తయారీకి వచ్చిన దశలో ఉన్న తోటల్లో ముంపు నీరు వల్ల వేరు వ్యవస్థ పాక్షికంగా, పూర్తిగా దెబ్బ తింటుంది. గెల తయారీకి అవసరమైన నీరు, పోషక పదార్థాలు మొక్క తీసుకోలేదు. తద్వారా గెల పూర్తిగా తయారవ్వకుండా, పక్వానికి వచ్చి నష్టం కలుగుంది. వీలైనంత వరకు మంచి గెలలు పరిశీలించి, మార్కెట్కు తరలించటం మంచిది.
● ముంపు నీటిని సాధ్యమైనంత త్వరగా తోట నుంచి బయటకు పంపి భూమి ఆరే విధంగా చేయాలి. ఆకులు, గెలలు బాగా తడిసే విధంగా లీటరు నీటికి ఐదు గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (0–0–52), ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్(13–0–45) ఎరువులను వెంటనే మూడు రోజుల వ్వవధిలో మూడుసార్లు ఒక దాని తరువాత మరొకటి పిచికారీ చేసుకోవాలి.
● నేలకు వొరిగిన గెలలు పక్వానికి పది రోజుల్లో వస్తుంది అని బావిస్తే ఎండిన అరటి ఆకులతో కప్పి ఉంచి, 15 రోజుల్లో మార్కెట్ చేసుకోవాలి. మిగిలి వాటికి వెదురు కర్రతో ఊతమిచ్చి మొక్కలు పడిపోకుండా చేసుకోవాలి. నేలలో మొక్క చుట్టూ గాడిలో 100 గ్రాముల యూరియా, 80 గ్రాముల మ్యూరియేట్ ఆప్ పొటాష్ వేసుకోవాలి.
నిల్వ ఉన్న నీటిని పూర్తిగా
బయటకు తీయాలి
సరైన ఎరువులు, మందులు వాడాలి
తెనాలి ఉద్యానశాఖ అధికారి
శ్రీనిత్య సూచనలు


