తీరంలో సముద్రస్నానాలు నిలిపివేత
రేపల్లె: మోంథా తుఫాన్ ప్రభావంతో సముద్రం కోతకు గురైందని, తీరంలో సముద్రస్నానాన్ని నిషేధించినట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డివిజన్లోని నిజాంపట్నం, దిండి పరిశావారిపాలెం, నక్షత్రనగర్లలో బీచ్లను మూసివేసినట్లు పేర్కొన్నారు. కార్తికమాసాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఈ ప్రాంతాలకు సబ్డివిజన్ ప్రాంతాలతోపాటు దూరప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారని, ఆయా బీచ్లకు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.
సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ
కొరిటెపాడు: సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ సాధ్యమని ది విశాఖపట్నం కో ఆపరేటీవ్ బ్యాంకు లిమిటెడ్ డైరెక్టర్స్ పి.వి.మల్లికార్జునరావు, సీహెచ్.రామారావు, చిన్నం కోటేశ్వరరావులు పేర్కొన్నారు. గుంటూరులోని కొరిటెపాడులో ఉన్న ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ గుంటూరు బ్రాంచి ఆధ్వర్యంలో ఆదివారం సహకార సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ సహకార వ్యవస్థ ప్రాధాన్యతను విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిందన్నారు. సహకార సూత్రాల కనుగుణంగా అందరి కోసం ప్రతి ఒక్కరూ అనే సూత్రంతో సామాజిక ఆర్థిక సంస్థలుగా సహకార సంఘాలు నిర్వహించకోవడానికి ఇంటర్నేషనల్ కో ఆపరేటీవ్ ఎలియన్స్ ఏడు సహకార సూత్రాలు ప్రతిపాదించిందన్నారు. విశాఖపట్నం కో ఆపరేటీవ్ బ్యాంకు లిమిటెడ్ ప్రజల కోసం అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలు, ఆరోగ్య బీమా, ఉచిత ప్రమాద బీమా, విద్యా ప్రతిభా పురస్కారాలను బ్యాంకు సభ్యులకు అందించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ ఇ.ఎర్రయ్యరెడ్డి, మేనేజర్ బుల్లికుమార్, కమిటి సభ్యులు కోట మాల్యాద్రి, డి.వెంకటరామయ్య, ఎస్.లక్ష్మీసుజాత, చిన్న, బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


