నిష్పక్షపాతంగా పంట నష్టం అంచనా వేయాలి
వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గోనెపూడిలో దెబ్బతిన్న పంటల పరిశీలన
నరసరావుపేట రూరల్: మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకూ నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గోనెపూడి గ్రామంలో తుఫాన్కు దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను గోపిరెడ్డి గురువారం పరిశీలించారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలతో పత్తి కాయ నల్లబారిందని, పూత, పిందె రాలిపోయిందని పత్తి రైతులు వివరించారు. రోజుల వయసు గల మిరప మొక్కలు భారీ వర్షాల కారణంగా నేలవాలాయని రైతు తుమ్మల రామారావు తెలిపారు. రెండు ఎకరాలకు రూ.1.30 లక్షలు పెట్టుబడి పెట్టామని పేర్కొన్నారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిపారు. పత్తి రైతులు ఎకరానికి రూ.80 వేలు పెట్టుబడి పెట్టి నేడు ఒట్టి చేతులతో నడిరోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు. మిరప రైతులు ఎకరానికి రూ.30 వేలు నుంచి రూ.40వేలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. జిల్లాలో 55వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, నరసరావుపేట మండలంలో 2,500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా పంట నష్టం అంచనాను అధికారులు ప్రారంభించలేదని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పంట నష్టం అంచనా వేయాలని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. యూరియా బస్తాలు కూడా బ్లాక్లో కొనుగోలు చేసే పరిస్ధితి రాష్ట్రంలో ఏర్పడిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు ప్రభుత్వమే ఉచితంగా పంట బీమా చెల్లించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తొలగించి రైతులే బీమా రుసుము చెల్లించుకోవాలని చెప్పడంతో రైతులు స్పందించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు పంటల బీమా కూడా రైతులకు అందే పరిస్థితి లేకుండా పోయిందని వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్, పార్టీ మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు షేక్ రెహమాన్, పార్టీ మండల కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావు, సర్పంచ్లు జెక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, భవనం నర్సిరెడ్డి, గడిబోయిన రామయ్య, గద్దె బాలకృష్ణ, పోతమేకల మోహనరావు, సుంకర చెంచయ్య, మూరే రవీంద్రారెడ్డి, పొదిలే ఖాజా తదితరులు పాల్గొన్నారు.


