
నిండుకుండలా టెయిల్పాండ్ రిజర్వాయర్
పులిచింతలకు 3,41,297 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 19 క్రస్ట్గేట్లు ద్వారా 3,41,297 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్పాండ్ రిజర్వాయర్ నిండుకుండలా ఉందన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 19 క్రస్ట్గేట్లు 3.50 మీటర్లు ఎత్తు ఎత్తి 3,41,297 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 75.50 మీటర్లకు గాను 74.47 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట సామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.389 టీఎంసీలు ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 62.08 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు.