అన్నదాతకు గుండెకోత | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు గుండెకోత

Jun 14 2025 7:43 AM | Updated on Jun 14 2025 7:45 AM

‘కోత’ల చంద్రబాబు మరోమారు అన్నదాతలకు గుండెకోత మిగిల్చారు. వ్యవసాయం దండగనే ఆయన తీరును మళ్లీ చాటుకున్నారు. రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ నేటికీ పథకం అమలు కాలేదు. ఏడాది గడిచింది. లబ్ధిదారుల ఈకేవైసీ అంటూ మెలిక పెట్టారు. దాదాపు నలభై వేల మంది రైతుల పేర్లు అసలు ప్రభుత్వం రూపొందించిన జాబితాలోనే లేవని తేలింది.

40 వేల పేర్లు గల్లంతు

వ్యవసాయ సిబ్బందికి అందిన జాబితా ప్రకారం జిల్లాలో ఈ పథకానికి 2,39,565 మంది రైతులు అర్హులుగా తేల్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023–24 సంవత్సరంలో 2,80,181 మంది రైతులకు రైతు భరోసా అందించింది. ఈ విధంగా జిల్లాలో దాదాపు 40 వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో కూటమి ప్రభుత్వం కోత పెట్టినట్టయింది. గత ప్రభుత్వ హయాంలో మే నెలలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద తొలి విడతలో రూ.7,500, అక్టోబర్‌ నెలలో పంట కోతతోపాటు రబీ సాగు అవసరాలకు రెండో విడతలో రూ.4 వేలు, జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి సమయంలో మరో రూ.2 వేలు.. ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు రూ.13,500 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటికే అన్నదాత సుభీభవ పథకాన్ని ఒక సంవత్సరం ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు లబ్ధిదారుల్లో భారీగా కోత విధించడంపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

నరసరావుపేట రూరల్‌: అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపనుంది. జిల్లాలో దాదాపు 40 వేల మంది రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో కనిపించడం లేదు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఊదరగొట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు పథకాన్ని మాత్రం ప్రారంభించలేదు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న దృష్ట్యా ఈ నెల 20వ తేదీన పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతుల జాబితాలు వ్యవసాయ సిబ్బందికి చేరాయి. గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు జాబితాలోని రైతుల ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు.

అర్హుల్లో ఆందోళన

గత ప్రభుత్వంలో 2023–24 సంవత్సరంలో రైతు భరోసా పథకాన్ని జిల్లాలో 2,80,181 మందికి అమలు చేశారు. ఇందుకుగాను రూ.378.24 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. ఈ పథకంలో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. వెబ్‌ల్యాండ్‌ సమాచారాన్ని అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్‌లో ఉంచి వ్యవసాయ సహాయకులతో పరిశీలన జరిపారు. వీరి నుంచి జాబితాను ఆర్‌టీజీఎస్‌కు పంపారు. ఇక్కడ మరోమారు పరిశీలన జరిపి, అర్హులైన వారి జాబితాను అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్‌లో ఉంచారు. వ్యవసాయ సహాయకుల జాబితాలోని రైతుల ఆధార్‌ ఆధారంగా ఈకేవైసీ చేస్తున్నారు. గ్రామాల్లో ఈకేవైసీ చేపట్టిన సిబ్బందికి కొంతమంది రైతుల పేర్లు జాబితాలో లేవని తెలిసింది. ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది రైతుల పేర్లు జాబితాలో గల్లంతయినట్టు సమాచారం. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో వ్యవసాయ సిబ్బందిపై ఇప్పటికే రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు పలు చోట్ల నిత్యం చోటుచేసుకుంటున్నాయి.

అన్నదాత సుఖీభవ పథకంలో భారీగా లబ్ధిదారుల కుదింపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2,80,181 మందికి ‘భరోసా’ జాబితాలో 40 వేల మంది పేర్లు తొలగించిన కూటమి సర్కార్‌ ఈకేవైసీ పూర్తి చేస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది కూటమి పాలకుల తీరుతో తీవ్ర ఆందోళనలో రైతులు

పథకం అమలు కాకుండానే లబ్ధిదారుల ఎంపికలో కొర్రీలు

అన్నదాతకు గుండెకోత1
1/1

అన్నదాతకు గుండెకోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement