న్యూస్రీల్
నది గట్లు కోత
నీట మునిగిన పంట
జల దిగ్బంధంలో జన జీవనం
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026
మహానది..
భువనేశ్వర్:
రాష్ట్రంలో తెరిపి లేని కుండపోత వానల తాకిడితో వరద ముంచెత్తుతుంది. ప్రముఖ నదుల్లో నీటి మట్టం అనుక్షణం ఉప్పొంగుతోంది. తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. పలు చోట్ల పంట పొలాల్లో నీరు చొరబడి పంట నీట మునిగింది. మహా నదిలో నీటిమట్టం రానురాను పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కటక్ జిల్లా మేజిస్ట్రేట్ దత్తాత్రేయ భావుసాహెబ్ షిండే ఆంక్షలు జారీ చేశారు. మహానది, శాఖ నదుల వెంబడి ఉన్న అన్ని ఘాట్లలోకి ప్రజల ప్రవేశాన్ని నివారించారు. నదిపై అన్ని కార్యకలాపాలను పరిమితం చేశారు. బాలి జాతర బహిరంగ స్థలం దిగువ ప్రాంతాలలో ఎలాంటి బహిరంగ సమావేశాలు లేదా సభలు నిర్వహించరాదని తెలిపారు. బ్యారేజీలు, వంతెనలు సమీపంలో నిలబడటాన్ని నిషేధించారు. దిగువ, నదీ తీరాల సమీపంలో అన్ని రకాల కార్యక్రమాలను నిలిపివేయాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహా నది ముండలి బ్యారేజీ గుండా వరద నీరు ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయానికి ఈ బ్యారేజి గుండా 6 లక్షల 37 వేల 585 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. సాయంత్రం సరికి దీని గుండా 7 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని అంచనా.
ప్రమాద సంకేతం దాటిన బైతరణి
కెందుఝొర్ జిల్లా ఆనంద్పూర్లో బైతరణి నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. బైతరణి నది ప్రమాద స్థాయి 38.36 మీటర్లు కాగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి నది నీటి మట్టం 38.37 మీటర్లకు చేరింది. రాష్ట్రంలోని సాలంది, జలకా, బైతరణి నదీ పరివాహక ప్రాంతాల్లో రాగల 24 గంటల పాటు వరద హెచ్చరిక జారీ చేశారు. రాజ్ఘాట్లో వరద నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుంది. మంగళ వారం మధ్యాహ్నం 1 గంటకు హెచ్చరిక స్థాయి 37.445 మీటర్లు అధిగమించి నీటి ప్రవాహం 38 మీటర్లకు తాకింది. ఎగువ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా బైతరణి నది అఖువాపొదా వద్ద ప్రమాద స్థాయిని దాటింది. సురక్షిత గరిష్ట
నీటి మట్టం 18.33 మీటర్లు కాగా 18.48 మీటర్ల మట్టంతో నదిలో వరద నీరు పొంగి పొరలుతుంది. జిల్లా యంత్రాంగం బహిరంగ ప్రకటనల ద్వారా నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది.
ప్రమాద స్థాయిని దాటిన సాలంది
భద్రక్ ప్రాంతంలో రాజ్ఘాట్ వద్ద సాలంది నది ప్రమాద స్థాయిని దాటింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రమాద స్థాయి 17 అడుగులు అధిగమించి 17.20 అడుగుల మట్టంతో వరద ఉధృతితో తాండవిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాలంది నది ఉప్పొంగుతోంది. వరద ముంపు పట్ల తీర ప్రాంతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఉధృతం అయింతే తిహిడి, చాంద్బాలి
తదితర 15కు పైగా పంచాయతీలు 7 లక్షల క్యూసెక్కుల నీటితో మునిగిపోతాయి. సాయంత్రం సరికి దెవులొపాలొ వద్ద సాలంది నది గట్టు 100 అడుగుల మేర తెగిపోయింది.
వ్యవసాయ భూముల్లోకి వరద నీరు
ఈ ఏడాది తొలి వరద నీరు దయా నదిలోకి ప్రవహించింది. పూరీ జిల్లాలో కొణాస్, డెలాంగ్లలో అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయని అంచనా. వర్షాల కారణంగా దయా, రాజూవా, మఛొరా నదుల నీటి మట్టం పెరుగుతోంది. వ్యవసాయ భూముల్లోకి వరద నీరు పొంగిపొర్లుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వంతెనపై 5 అడుగుల నీరు
పల్లొలొహడా ప్రాంతం బంవుసొపొదా నది వంతెనపై 5 అడుగుల వరద నీరు ప్రవహిస్తోంది. తెల్కోయి నుండి ఢెంకనాల్, అంగుల్, కటక్లకు వెళ్లే ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మండల కార్యాలయం మరియు 10 పంచాయతీలకు అనుసంధానం ముంపునకు గురై రాకపోకలు నిలిచిపోయాయి.


